TG: ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలు.. అధికారులపై రెచ్చిపోయిన మంత్రి పొంగులేటి

by Gantepaka Srikanth |

పేద‌వాడి సొంతింటి క‌ల‌ను నెర‌వ‌ర్చే సంక‌ల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు, చెల్లింపుల విష‌యంలో అవినీతికి పాల్పడితే ఎంత‌టి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి హెచ్చరించారు.

TG: ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలు.. అధికారులపై రెచ్చిపోయిన మంత్రి పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేద‌వాడి సొంతింటి క‌ల‌ను నెర‌వ‌ర్చే సంక‌ల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు, చెల్లింపుల విష‌యంలో అవినీతికి పాల్పడితే ఎంత‌టి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి హెచ్చరించారు. ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్ధిదారుల స‌మ‌స్యలు, సందేహాల‌ కోసం గ‌త వారం హౌసింగ్ కార్పొరేష‌న్‌లో ప్రారంభించిన కాల్‌సెంట‌ర్‌కు వ‌చ్చిన ఫిర్యాదుల‌పై సెక్రెటేరియట్‌లోని త‌న చాంబ‌ర్‌లో శుక్రవారం హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీ వీపీ గౌత‌మ్‌, సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెస్ ఏడీజీ సంగ్రామ్ సింగ్‌పాటిల్‌‌తో క‌లిసి సమీక్షించారు. ఏయే అంశాల‌పై కాల్ సెంట‌ర్‌కు ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌నో అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరుకు ల‌బ్ధిదారుల నుంచి లంచం అడిగే ఇందిర‌మ్మ క‌మిటీ స‌భ్యుల‌ను త‌క్షణం క‌మిటీ నుంచి తొల‌గించి క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు.

సూర్యాపేట జిల్లా మ‌ధిరాల మండ‌లం పోలుమ‌ల్ల గ్రామంలో కొండ లింగ‌య్య అనే వ్యక్తికి ఇందిర‌మ్మ ఇల్లు మంజూరు కోసం ప‌ది వేలు డిమాండ్ చేసిన ఇందిర‌మ్మ కమిటీ స‌భ్యుడు స‌త్తయ్యను, జ‌న‌గాం జిల్లా దేవ‌రుప్పల మండ‌లం ప‌డ‌మ‌టి తండాలో శివ‌మ్మ అనే ల‌బ్ధిదారు నుంచి పంచాయతీ సెక్రెటరీ రూ.30 వేలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రాగా విచార‌ణ‌లో ఇందిర‌మ్మ కమిటీ స‌భ్యుని పాత్ర ఉంద‌ని తేలింది. దీంతో ఈ అంశంపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపి 24 గంట‌ల్లో నివేదిక ఇవ్వాల‌ని మంత్రి ఆదేశించారు. పేద‌ల‌ను ఇబ్బందిపెట్టి డ‌బ్బుల వ‌సూళ్లకు పాల్పడితే ఫిర్యాదు అందిన 24 గంట‌ల్లోనే చ‌ర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. కాల్ సెంట‌ర్‌కు వ‌చ్చిన ఫిర్యాదును త‌క్షణం ఆయా జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంప‌డంతోపాటు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యానికి కూడా పంపించాల‌ని సూచించారు. ఇటువంటి ఫిర్యాదుల‌పై త‌మ కార్యాల‌యం కూడా మానిట‌రింగ్ చేస్తుంద‌ని వెల్లడించారు. లంచ‌మ‌డిగితే టోల్ ఫ్రీ నెంబ‌ర్ 18005995991కు కాల్ చేసి వివ‌రాల‌ను తెలియజేయాలని లబ్ధిదారులకు సూచించారు.

వారిని వెంటనే సస్పెండ్ చేయాలి

అదేవిధంగా ఖ‌మ్మం, జ‌గిత్యాల‌, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇండ్లు మంజూరు కాని న‌లుగురికి వారి ఖాతాలో నిధులు జ‌మ‌చేసిన గ్రామ పంచాయతీ సెక్రెట‌రీల‌ను త‌క్షణమే స‌స్పెండ్ చేసి ఈ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపించాల‌ని అధికారుల‌కు సూచించారు. ల‌బ్ధిదారులకు ఇంటి నిర్మాణ ద‌శ‌ల‌ను బ‌ట్టి ప్రతీ సోమ‌వారం నిధులు మంజూరు చేస్తున్నామ‌ని, కొన్ని బ్యాంకులు ఈ నిధుల‌ను పాత బ‌కాయి కింద జ‌మ చేసుకుంటున్నాయ‌ని, ఇటువంటి చ‌ర్యల‌ను స‌హించేదిలేద‌ని హెచ్చరించారు. స‌ద‌రు బ్యాంకుల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. దీనిపై రాష్ట్రస్థాయి బ్యాంక‌ర్ల క‌మిటీకి లేఖ రాయాల‌ని హౌసింగ్ ఎండీని ఆదేశించారు. ఆధార్ నెంబ‌ర్ ఆధారంగా చెల్లింపుల్లో ఎదురవుతున్న స‌మ‌స్యలను ఈనెల 25వ తేదీలోగా ప‌రిష్కరించి ద‌స‌రా పండ‌గ‌లోపు చెల్లింపులు పూర్తిచేయాల‌న్నారు. ఏఈలు ప్రతీ గ్రామంలో ల‌బ్ధిదారుని వ‌ద్దకు ఆధార్, పేరు గాని త‌ప్పు ఉంటే గ్రామ కార్యద‌ర్శి ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లి స‌రిచేయించాలన్నారు. ల‌బ్ధిదారుడే స్వయంగా ఈ దిద్దుబాటు చేసుకొనేలా త్వరలో యాప్‌ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఒక‌టి రెండు రోజుల్లో ఇది అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు.

Next Story