యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలికి మంత్రి కేటీఆర్ కీలక విజ్ఞప్తి

by Disha Web Desk 19 |
యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలికి మంత్రి కేటీఆర్ కీలక విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రగతిభవన్లో సోమవారం యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలితో భేటీ అయ్యారు. పలు వివరాలను అందజేశారు. 2005లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మృతి ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం (షరియా చట్టం) మేరకు రూ.15 లక్షల పరిహారాన్ని బాధితుడి కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు గతంలోనే స్వయంగా తాను నేపాల్ వెళ్లి 2013లోనే బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు.

షరియా చట్టం ప్రకారం బాధితుల కుటుంబం క్షమాపణ పత్రం అందిస్తే వీరిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే బాధితుడి కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటీషన్‌ను తిరస్కరించిందని, దుబాయ్ రాజు క్షమాబిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని తెలిపారు. ప్రత్యేక చొరవ తీసుకొని, దుబాయిలోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయులను వెంటనే దేశానికి పంపించేలా ప్రయత్నం చేయాలని కోరారు. అనంతరం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. హైదరాబాద్ లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం మరియు ఐటీ, ఐటీ అనుబంధ రంగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి యూఏఈ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్ట్ అప్ సంస్థలను అనుసంధానం చేసేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed