ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ పని చేయాలి: మంత్రి కేటీఆర్ కీలక సూచన

by Disha Web Desk 19 |
ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ పని చేయాలి: మంత్రి కేటీఆర్ కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపైన మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో పదిమందితో కూడిన కార్యక్రమాల అమలు కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలు, జరుగుతున్న తీరును పరిశీలిస్తుంది. వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని.. జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ కమిటీ ద్వారానే కేసీఆర్ పార్టీ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ తీరు, వాటికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని తెలిపారు. ఈ కమిటీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ ఎన్నికల సంవత్సరంలో ప్రతి ఎమ్మెల్యే అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో కలిపి ఒక టీంని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ టీమ్ ద్వారా అటు పార్టీకి ప్రజలకు నిరంతరం సమాచారం అందించేందుకు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకుపోయేందుకు సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలన్నారు.

ఈ ఆత్మీయ సమ్మేళనాలు మే నెల వరకు కూడా చేసుకోవచ్చని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరింత విస్తృతంగా, కూలంకషంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచించారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనం కచ్చితంగా ముఖ్యమంత్రి పార్టీ కార్యకర్తలకు రాసిన ఆత్మీయ సందేశంతోనే ప్రారంభించుకోవాలన్నారు. సీఎం ఆత్మీయ సందేశం ప్రతి కార్యకర్తకు అందేలా అవసరమైన కరపత్రాల లాంటి మెటీరియల్స్‌ని సిద్ధం చేసి విస్తృతంగా పంపిణీ చేసుకోవాలన్నారు.

Next Story