రేవంత్, ఈటల, రాజా సింగ్.. ముగ్గురు ఓడిపోవటం ఖాయం: మంత్రి కేటీఆర్

by Disha Web Desk 19 |
రేవంత్, ఈటల, రాజా సింగ్.. ముగ్గురు ఓడిపోవటం ఖాయం: మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్‌లో కుట్ర ఉందని, బీసీ.. మైనార్టీల మధ్య పంచాయతీ పెట్టాలనే ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌ లోపభూయిష్టంగా ఉందని, కాంగ్రెస్‌.. బీజేపీ స్ఫూర్తితో మైనార్టీ డిక్లరేషన్‌ ఇచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్‌, BJP, ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఒక్కటే అని ఆరోపించారు. కాంగ్రెస్‌ గతంలో కూడా చాలా తప్పుడు వాగ్దానాలు చేసిందన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ఏ డిక్లరేషన్ అయినా చిత్తుకాగితాలే అన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్‌ను నిలుపుకోలేదని, ఇప్పుడు మైనార్టీ, బీసీ డిక్లరేషన్స్ చేసినా అమలులో తుంగలో తుక్కుతారని విమర్శించారు. 6 నెలల్లో మైనార్టీల కులగణన చేస్తామని కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్‌లో ప్రకటించిందని, ఆ అవసరం లేదు అన్నారు. మైనార్టీలను బీసీ కులగణనలో చేర్చుతామనడం సమంజసం కాదన్నారు. బీసీల్లో చేర్చితే మైనార్టీలకు అందజేసే సంక్షేమం ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతరాజ్యాంగం ప్రకారం ముస్లిం, క్రైస్తవ, సిక్కులుగా అల్ఫాసంఖ్యాకులుగా గుర్తించిందన్నారు.

ముస్లింలను బీసీలుగా గుర్తిస్తే మైనార్టీ మినిస్ట్రరీ, కార్పొరేషన్‌తో పాటు ప్రత్యేక హోదాను కోల్పోతారని, దీంతో వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ ప్రతిపాదనను కాంగ్రెస్‌ వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఓట్ల కోసం కాంగ్రెస్‌ చిచ్చుపెట్టే రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు.

పదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల సంక్షేమానికి కేవలం రూ.930 కోట్లు ఇస్తే.. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యి ఆటలాడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ముఖ్య నేతల సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ వీక్‌ క్యాండిడేట్స్‌ను నిలబెట్టిందని ఆరోపించారు. జనాభా గణన చేయాలంటే బీసీల లెక్కలు ముందు తేల్చాలని, బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు.

బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువదన్నారు. మోడీ వచ్చినా ఎవరు వచ్చినా గెలువదని, గోషామహల్‌లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. కొడంగల్‌లో రేవంత్, హుజూరాబాద్‌లోనూ ఈటల ఓడిపోతున్నారన్నారు. కొడంగల్‌లో చెల్లని రూపాయం కామారెడ్డిలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. రేవంత్ టికెట్లు అమ్ముకున్నారని ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. రేవంత్ ఎంత ఎక్కువ మాట్లాడితే బీఆర్ఎస్‌కు అంత లాభం అన్నారు. మోడీ స్టీరింగ్ అమిత్ షావద్ద ఉందని, బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ వద్ద ఉందన్నారు. కాంగ్రెస్‌లో అరాచకరాజకీయం నడుస్తుందని మండిపడ్డారు.

Read More...

మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించండి : బడే నాగజ్యోతి..


Next Story

Most Viewed