16న జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలు ప్రారంభం.. మంత్రి కేటీఆర్

by Dishafeatures2 |
16న జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలు ప్రారంభం.. మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 16వ తేదీన జిహెచ్ఎంసి వార్డ్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నదని ఈ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ వారితో మమేకమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జిహెచ్ఎంసి లో భారత రాష్ట్ర సమితి కార్పోరేటర్లతో మంత్రి మంగళవారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి పాటుపడుతున్న తీరుని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని వారికి మార్గదర్శనం చేశారు.తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో 16వ తేదీన వార్డు కార్యాలయాల ప్రారంభం చేస్తున్నామని, వీటి ద్వారా నగరంలో సుపరిపాలన మరింత బలోపేతం అవుతుందన్నారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కెసిఆర్ ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను, ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా అందించాలన్న ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలను చేపట్టారని కేటీఆర్ తెలిపారు. ఈ ఆలోచన దృక్పథంలోంచి జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల, మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ఇంటి ముందట నిలిపేందుకు ప్రయత్నం చేశామని తెలిపారు. ఇదే వికేంద్రీకరణ స్ఫూర్తితో వార్డ్ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు వార్డు కార్యాలయ వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి ఏర్పాటు చేస్తున్న వార్డు కార్యాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని కేటీఆర్ తెలిపారు. వార్డు కార్యాలయ వ్యవస్థపై అవగాహన కోసం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఒక విస్తృతస్థాయి సమావేశం కార్పొరేటర్ల కోసం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 16వ తేదీన జరిగే వార్డు కార్యాలయ ప్రారంభోత్సవాలకు తమ పరిధిలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వార్డులోని ప్రముఖ వ్యక్తులు, సంఘాలను కలుపుకుపోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

కార్పొరేటర్లు ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు వెళుతూనే పార్టీ బలోపేతం కోసం కూడా పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూచించారు. పార్టీ మరియు ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. పార్టీ తరఫున నిర్వహించే సమావేశాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని, పార్టీ బలోపేతం ద్వారానే మనం మరొకసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి విజయం తథ్యం అన్న విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, కార్పొరేటర్ల సారథ్యంలో తమ తమ వార్డుల్లో పార్టీని ఎన్నికలకు సమయత్తం చేయాలన్నారు. రానున్న సంవత్సర కాలం పాటు పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయని తెలిపిన కేటీఆర్, వాటన్నింటిని విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కార్పొరేటర్లకు సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ లు నవీన్ రావు ,శంబిపూర్ రాజు, మేయర్ విజయలక్ష్మి ఇతర సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed