- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహా శివరాత్రి వేళ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
మహా శివరాత్రి(Maha Shivratri) పండగ పర్వదినం నేపథ్యంలో అన్ని శైవ క్షేత్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఆదేశించారు.

దిశ, వెబ్డెస్క్: మహా శివరాత్రి(Maha Shivratri) పండగ పర్వదినం నేపథ్యంలో అన్ని శైవ క్షేత్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహా శివరాత్రి పర్వదినం జరగనున్న నేపథ్యంలో సచివాలయంలో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, కీసర రామలింగేశ్వర స్వామి, ఏడుపాయల వన దుర్గ భవానీ అమ్మవారు, రామప్ప, మేళ్ళచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం, చాయా సోమేశ్వర ఆలయం పానగళ్ళు, సోమేశ్వర దేవస్థానం పాలకుర్తి, వెయ్యి స్థంభాల గుడి, మెట్టుగుట్ట దేవాలయం, కాశిబుగ్గ ఆలయం, భద్రకాళి, తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై మంత్రి సురేఖ అధికారులను సేకరించారు.
గతేడాది శివరాత్రి ఉత్సవాల నిర్వహణా అనుభవాల ఆధారంగా ఈ సంవత్సరం భక్తులకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్ర హోమం, ప్రవచనాలతో పాటు క్యూలైన్ మేనేజ్మెంట్, తాగునీరు వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విద్యుత్ వసతి, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు మంత్రికి సమగ్రంగా వివరాలు తెలిపారు. మంత్రి కూడా కొన్ని ప్రత్యేక సూచనలు అందజేశారు.
ఎండా కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉపావసం ఉండే భక్తులకు పండ్లు, అల్పాహారం ఉచితంగా పంపిణీ చేయాలని తెలిపారు. ప్రతి ఆలయం దగ్గర ఎంట్రీ పాయింటులు, ఎగ్జిట్ పాయింటులను పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ దేవాలయాల దగ్గర ఎక్కడా లిక్కర్ అమ్మకాలు చేయరాదని ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసి, లిక్కర్ దొడ్డి దారిని అమ్మినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయా దేవాలయాలున్న పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో స్థానిక, ఆంగ్ల భాషల్లో సూచీ బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత కోసం సీసీ కెమోరాల ఏర్పాటు, పారిశుధ్య చర్యలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని.. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే చోట అంబులెన్స్ లు కూడా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
అన్ని దేవాలయాలను సమన్వయం చేసేందుకు హైదరాబాద్ ఎండో మెంట్ కమిషనరేట్ ఆఫీసులో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి నదీ, ఇతర నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో నదీ హారతి వంటి కార్యక్రమం చేపట్టేందుకు అవసరమైన కసరత్తు చేయాలని కోరారు. ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ కసరత్తు చేయాలని చెప్పారు. మహా శివరాత్రి నిర్వహణకు ఖర్చుకు వెనకాడ కూడదని, ఏదైనా ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిపేందుకు జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులతో సమన్వయం అవసరమని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.






