వందశాతం పంటనష్టం అందజేస్తాం.. మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా

by Disha Web Desk 2 |
వందశాతం పంటనష్టం అందజేస్తాం.. మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఈర్లపల్లి శంకర్‌లతో కలిసి జూపల్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు కరెంట్ ఇవ్వకపోతే సచివాలయం ముట్టడిస్తామని హరీష్ రావు అంటున్నారు.. పదేళ్లలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు. పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇవ్వలేదని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహణ చేస్తే ఇప్పుడు సాగునీటి కష్టాలు వచ్చేవి కావని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌లపై దృష్టి పెట్టారు తప్పా.. ప్రజల కోసం ఏనాడూ ఆలోచించలేదని చెప్పారు. పంట నష్టం జరిగిన రైతులకు అందరికీ వందశాతం అకౌంట్లో నగదు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. గడిచిన పదేళ్లలో ఏనాడూ పంటనష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ఆదుకోలేని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

అసలు హరీష్ రావుకు మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాగోగులు కోరుకునే ప్రభుత్వం, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. తాము రైతులకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై 1 లక్ష 81 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటివరకు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ రాలేదని అన్నారు. హరీష్ రావుకు ఛాలెంజ్ విసురుతున్నా.. ఎక్కడకి రమ్మంటే అక్కడికి వస్తా.. చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందే బీఆర్ఎస్ అని సీరియస్ అయ్యారు. మీ ప్రభుత్వ హయాంలో దోపిడీ జరగకుంటే, అన్ని వర్గాలకు న్యాయం జరిగేదని అన్నారు. 8 లక్షల కోట్ల అప్పుల చిప్పలు మాకు అప్పజెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు.

Next Story

Most Viewed