సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం

by Prasad Jukanti |

మంత్రి జూపల్లి కృష్ణారావు సాదాసీదాగా మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు.

సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులతో సరదాగా మాట్లాడారు. బుధవారం నగరంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం ఆయన ఎర్రమంజిల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో (Hyderabad Metro Rail) వెళ్లారు. ప్రోటోకాల్స్ కు భిన్నంగా ఆయన అత్యంత సాదాసీదాగా మెట్రో ఎక్కారు. మెట్రో స్టేషన్ కు చేరుకున్న మంత్రి స్వయంగా టికెట్ తీసుకుని ప్లాట్‌ఫాంపైకి వెళ్లారు. రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, మంత్రి సీటు కోసం ప్రయత్నించకుండా తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించారు. ఈ క్రమంలో తోటి ప్ర‌యాణికుల‌తో ఆయన ముచ్చటించారు. మెట్రో ప్రయాణంలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

మెట్రోతో ట్రాఫిక్ చిక్కులకు చెక్:

మంత్రిని తమ మధ్య చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆయన పలకరింపుతో ఉత్సాహంగా మాట్లాడారు. పలువురు ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా, మంత్రి ఎంతో ఓపికగా వారితో ఫొటోలు దిగారు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రో ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు. ఎటువంటి సెక్యూరిటీ హడావుడి లేకుండా మంత్రి ఇలా సామాన్యుల మధ్య కలిసిపోవడం చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా గతేడాది ఆగస్టులోనూ మంత్రి ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్‍బీ వరకు మెట్రోలో ప్రయాణం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

Next Story