ఎన్ని ఆటంకాలు వచ్చినా దానిని ఆపే ప్రసక్తే లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి

by Disha Web Desk 2 |
ఎన్ని ఆటంకాలు వచ్చినా దానిని ఆపే ప్రసక్తే లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్‌ను ఆపే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచన కూడా లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు వాడే మోటార్లకు మీటర్లను కూడా బిగించబోమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యుత్ పాలసీ పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉచిత విద్యుత్ యధాతథంగా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. పేద ప్రజలకు అందించే రాయితీలపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, ప్రైవేటు రంగానికి అప్పజెప్పడానికే ఈ ప్రయత్నాలన్నీ అని ఆరోపించారు. నూతన విద్యుత్ పాలసీలో భాగంగా తీసుకొస్తున్న మార్పులపై అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఈ నెల 22వ తేదీలోగా అభిప్రాయాలను చెప్పాలని డెడ్‌లైన్ విధించింది. దీనికి స్పందనంగా సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి పై అంశాలను వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలూ ఉచితంగా వ్యవసాయ విద్యుత్‌ను అందించడం కేంద్ర ప్రభుత్వానికి కంటగింపుగా మారిందని, ఈ కారణంగానే ఆటంకాలు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఈ స్కీమ్ కంటిన్యూ అవుతుందని, కేంద్రం ఒత్తిళ్ళకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగుతుందన్నరు. దేశంలో పేదరికం, ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నంతకాలం సబ్సిడీలు అవసరమని నొక్కిచెప్పారు. దేశానికే అన్నం పెడుతున్న రైతులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇచ్చి ఉపశమనం కలిగించాలని, వారి ఖర్చుల్ని తగ్గించి ఆదాయం పెంచడంపై దృష్టి పెట్టాలని, ఆ పని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదన్నారు.

రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని 'ఉచితం' అని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని, ఇలాంటి ప్యూడల్ ఆలోచనలతో పేదలకు, రైతులకు నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం విధానపరంగానే వ్యతిరేకిస్తున్నదని, ఆమోదించబోదని, దేశవ్యాప్తంగా రైతులను ఏకం చేసి దీని వెనక ఉన్న కుట్రలను బహిర్గతం చేస్తామన్నారు.


Next Story