మంత్రి జగదీశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజకీయం వద్దన్నందుకు రాద్ధాంతం

by Disha Web Desk 2 |
మంత్రి జగదీశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజకీయం వద్దన్నందుకు రాద్ధాంతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వ్యవహారం కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. పరస్పరం విమర్శలు గుప్పించుకోకుండా రోజు గడవడం లేదంటే ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ వైరం ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేతలను ఉద్దేశించి మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఎరువుల గోదాంకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ వ్యతిరేకంగా, టీఆర్ఎస్‌కు అనుకూలమైన వ్యాఖ్యలు చేస్తుండటంతో అదే వేదికపై ఉన్న బీజేపీకి చెందిన సింగిల్ విండో డైరెక్టర్లు ఇద్దరు మంత్రి వైఖరిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీ నాయకులకు బట్టలిప్పి కొడతా.. బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినడం లేదారా? ఏం చదివార్రా మీరు? అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. అంతటితో ఆగని మంత్రి ఇష్టం లేకుంటే గుజరాత్ వెళ్లిపోండంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. మంత్రి మాటలపై రాజకీయాంగా దుమారం రేగింది.

ఇక్కడ రాజకీయమా?:

ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడకూడదన్నందుకు మంత్రి ఈ రీతిగా రెచ్చిపోవడంపై సదరు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బాధ్యతయుతమైన పదవిలో ఉన్న మంత్రి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు సహజమే అయినా బట్టలిప్పి కడతా అంటూ రెచ్చిపోవడం సంస్కారం అనిపించుకోదని, రాజకీయ కారణాలతో ఇలా చిటపటలాడటం సరికాదనే మాటలు వినిపించాయి. ఈ వ్యవహారంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో ఇద్దరు బీజేపీ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా మంత్రి వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story

Most Viewed