మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందే: సర్దార్ వినోద్

by Disha Web Desk 19 |
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాల్సిందే: సర్దార్ వినోద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేపర్ లీకేజీ అంశం సర్వసాధారణం అని బాధ్యత లేని మాటలు మాట్లాడిన రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ విద్యార్థి జన సమితి విభాగం (వీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి మతిలేని మాటలు మానుకోవాలని, తన స్వంత నియోజకవర్గం నిర్మల్ జిల్లా కేంద్రంలో గల మున్సిపాలిటీలో 42 ప్రభుత్వ ఉద్యోగాలను సైతం అసలైన అర్హులకు ఇవ్వకుండా అమ్ముకున్న చరిత్ర ఆయనది అని ఆరోపించారు.

లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు ఖర్చు చేసుకుని, ఏళ్ల తరబడి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ, కోట్లాడితె అరకొర ఉద్యోగ నియామక నోటిఫికేషన్ జారీ చేస్తే, తీరా ఇప్పుడు వాటిని కూడా లీక్ చేసి పైసలా కోసం తెలంగాణలో పరీక్ష పేపర్‌లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇవి తెలియని మంత్రి కేసీఆర్, కేటీఆర్‌ల మెప్పు కోసం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగులకు అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తక్షణమే బేషరతుగా మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని యెడల నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కాక తప్పదు అని హెచ్చరించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే ఏ లీకేజీలు లేకుండా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Next Story