నేడే బడ్జెట్.. ఆ కార్యక్రమానికి ప్రత్యేక నిధులు?

by Disha Web Desk 2 |
నేడే బడ్జెట్.. ఆ కార్యక్రమానికి ప్రత్యేక నిధులు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్‌లోని వివిధ అంశాలపై మంత్రులకు కేసీఆర్ వివరించినట్లు సమాచారం. సమావేశాల్లో విపక్ష సభ్యుల ప్రశ్నలకు దీటుగా బదులిచ్చేలా వారికి నిర్దేశం చేసినట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై రాజ్‌భవన్ నుంచి శనివారం రాత్రి విడుదలైన ప్రకటనపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ టర్ముకు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అనే అభిప్రాయం పార్టీల్లో నెలకొన్నది. ఈ సారి బడ్జెట్ సైజు గతేడాది కంటే ఎక్కువగానే ఉంటుందన్న వార్తల నేపథ్యంలో మంత్రులెవరూ కామెంట్ చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. గవర్నర్ ప్రసంగం లేకపోవడాన్ని విపక్షాలు ప్రస్తావించి హడావిడి చేసే అవకాశం ఉంటుందన్న అంచనాతో అసెంబ్లీ ప్రాంగణంలో, వెలుపలా భారీ స్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గతేడాది అక్టోబరులో ముగిసిన సమావేశాలకు కొనసాగింపుగానే వీటిని నిర్వహిస్తున్నందున గవర్నర్ ప్రసంగం ఉండడంలేదు. మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ఉదయం 11.30 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతోనే ఈ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై వివిధ పార్టీల నేతలతో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశమై షెడ్యూలును ఖరారు చేస్తుంది. పదిరోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా భావిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 20వ తేదీకల్లా పూర్తి చేస్తే ఆ తర్వాత యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవంపై దృష్టి పెట్టాలనుకుంటున్నది. బడ్జెట్‌లోని అంశాలను చదువుకోడానికి మంగళవారం శాసనసభా సమావేశాలకు సెలవు ప్రకటించడం ఆనవాయితీ. ఆ ప్రకారం తిరిగి సభా సమావేశాలు బుధవారం మొదలవుతాయి.

గవర్నర్ ప్రసంగం లేనందున నేరుగా బడ్జెట్‌పైన వివిధ పార్టీల సభ్యులు చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు ఎక్కువగా ఫోకస్ చేసి నిలదీయాలనుకుంటున్నాయి. ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చి గాలికొదిలేసిన అంశాలను లేవనెత్తాలనుకుంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఈ సారి దళితబంధుకు కనీసంగా రూ.15వేల కోట్లకంటే ఎక్కువే నిధులను కేటాయించే అవకాశం ఉన్నది. బడ్జెట్ తయారీ సందర్భంలో ఆర్థిక శాఖ అధికారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కనీసంగా రూ.20వేల కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని సీఎం కేసీఆర్ పలు బహిరంగసభల్లో చెప్పుకొచ్చారు. ఆ ప్రకారం అన్నింటికంటే ఎక్కువ కేటాయింపులు ఈ పథకానికే దక్కే అవకాశం ఉన్నది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టాలనుకుంటున్న 'మన ఊరు - మన బడి' కార్యక్రమాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించి ప్రత్యేకంగా నిధులను కేటాయించనున్నది.

Next Story

Most Viewed