జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు మంత్రి కీలక సూచన

by Disha Web Desk 2 |
జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు మంత్రి కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూనియర్ పంచాయితీ కార్యదర్శు(జేపీఎస్)లను ప్రభుత్వం తరపున చర్చలకు పిలవలేదని.. ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మోద్దని, ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించాలని మంత్రి సూచించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై ముఖ్యమంత్రికి మంచి అభిప్రాయం ఉందని, ఆ పేరును పోగొట్టుకోవద్దని హితవు పలికారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పు అన్నారు.

జీపీఎస్‌లు సమ్మె చేయడం నిబంధనలకు విరుద్ధం.. చట్ట విరుద్ధం.. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధం అన్నారు. సంఘాలు స్థాపించబోమని, యూనియన్లలో చేరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్లకు దిగబోమని ప్రభుత్వానికి బాండ్ రాసి రాసిచ్చిన ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదన్నారు. పైగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు. సమస్యలపై మాట్లాడానని, కానీ ప్రభుత్వం చర్చలకు పిలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా మించిపోలేదని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వెంటనే సమ్మెను వివరించి విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హితవు పలికారు.



Next Story

Most Viewed