Metro Strike : మెట్రో సిబ్బంది మెరుపు సమ్మె!

by Disha Web Desk 4 |
Metro Strike : మెట్రో సిబ్బంది మెరుపు సమ్మె!
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ మెట్రో సిబ్బంది సమ్మెకు దిగారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళన చేపట్టారు. వెంటనే అధికారులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పూనుకున్నారు. నేడు విధులకు సగం మంది ఉద్యోగులు మాత్రమే హాజరు కాగా, మిగతా ఉద్యోగులంతా సమ్మె బాట పట్టారు. ఉద్యోగుల సమ్మెతో హైదరాబాద్ మెట్రో సంస్థపై ఎఫెక్ట్ పడింది. మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు రెడ్‌లైన్ టికెటింగ్ ఉద్యోగుల విధులను బహిష్కరించారు. దీంతో, అమీర్‌పేట్ మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో స్టేషన్‌లలో టికెట్ వ్యవస్థ స్తంభించింది.

తమకు ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్ల నుంచి కేవలం రూ.11,143 జీతం మాత్రమే ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని.. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వెంటనే తమకు జీతం పెంచాలని కోరారు. రసూల్‌పురా మెట్రో ఆఫీస్ వద్ద మెట్రో ఉద్యోగులు నేడు ధర్నా చేపట్టారు. రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు జీతం పెంచాలని డిమాండ్ చేశారు.

ఇక, ఉద్యోగుల సమ్మెతో అమీర్ పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు. సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేపట్టడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆఫీసులు, కాలేజీలకు వెళ్లే ప్రయాణికులు మెట్రో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎల్బీనగర్ నుండి మియాపూర్ లైన్‌లో టికెట్ కౌంటర్లలో సుమారు 300 మంది విధులు నిర్వహించాలి. కానీ ఇవాళ 150 మంది మాత్రమే విధులకు హాజరైనట్టుగా సమాచారం.



Next Story

Most Viewed