ఒకేరోజు బరిలోకి అమిత్ షా, రేవంత్, KCR.. రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపనున్న మార్చి ‘12’

by Disha Web Desk 19 |
ఒకేరోజు బరిలోకి అమిత్ షా, రేవంత్, KCR.. రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపనున్న మార్చి ‘12’
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పోటాపోటీ సభలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 12న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లనున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే కేడర్‌ను సంసిద్ధం చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే పార్టీ ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. రాష్ట్రంలోని పార్టీలన్నీ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలతో భేటీ అవుతున్నాయి.

పరేడ్‌ గ్రౌండ్ వేదికగా కాంగ్రెస్

అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ఒకవైపు.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమల్లోకి చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో స్వయం సహాయక మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నది. లాంఛనంగా ఈ నెల 12న పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. అదే వేదిక మీద మహాలక్ష్మీ గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం. కోడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్కొక్కటిగా లాంచింగ్ చేయడంపై దృష్టి సారించి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తున్నది. మరోవైపు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఎండగట్టడంతోపాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు.

కరీంనగర్ నుంచి బీఆర్ఎస్

కేసీఆర్ ఉద్యమకాలం నుంచి తమకు సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ నెల 12న సభ నిర్వహిస్తున్నారు. సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. లక్ష మందికి పైగా ప్రజలను తరలించేందుకు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఇక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించనున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలువబోతుందని ధీమాను వ్యక్తం చేయడంతో పాటు కేడర్‌లోనూ భరోసా నింపనున్నారు. ఈ సభతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో ప్రజలకు నీళ్లు, విద్యుత్ ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించనున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇస్తుందని తనదైన శైలిలో విమర్శలు చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్‌ ఉచితంగా ఇస్తామని చెప్పి మాట తప్పుతోందని ఎదురుదాడి చేయనున్నారు.

ఎల్బీ స్టేడియం నుంచి బీజేపీ

తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 12న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో మూడు వేల మందితో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పని చేయాలి..? ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..? ప్రజలను ఆకర్షించే పోస్టుల అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నేతలతో భేటీ కానున్నారు. దాదాపు 25 వేల మంది హాజరుకానున్నారు. సాయంత్రం 17 పార్లమెంట్ల వర్కింగ్ గ్రూప్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. వీరందరికీ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు. దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉంటే ఒకే రోజూ మూడు ప్రధానపార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. లోక్‌సభకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే ఏ పార్టీ ఎన్నిస్థానాల్లో విజయం సాధిస్తుందో చూడాలి.

Next Story

Most Viewed