Meenakshi Natarajan: పటాన్ చెరు కాంగ్రెస్ లో గుడెం వర్సెస్ కాటా.. మీనాక్షి నటరాజన్ సీరియస్!

by Prasad Jukanti |

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇష్యూపై మీనాక్షి నటరాజన్ గుస్సా అయ్యారు.

Meenakshi Natarajan: పటాన్ చెరు కాంగ్రెస్  లో గుడెం వర్సెస్ కాటా.. మీనాక్షి నటరాజన్ సీరియస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికార కాంగ్రెస్ లో గత కొంత కాలంగా హీట్ పుట్టిస్తున్న పటాన్ చెరు కాంగ్రెస్ పంచాయతీ (Patan Cheru Congress Issue) ఎపిసోడ్ నూతన ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) వద్దకు చేరింది. ఇవాళ గాంధీ భవన్ లో జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష సందర్భంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అంశాన్ని కాటా శ్రీనివాస్ సమావేశంలో ప్రస్తావించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం తాను పని చేశానని, ఇప్పుడు నేను కష్టకాలంలో ఉంటే ఎవరూ అండగా లేరని కాటా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహా, జిల్లా ఇన్ చార్జి మంత్రి కొండా సురేఖా, జగ్గారెడ్డి తదితర ముఖ్యనేతలు హాజరైన ఈ సమావేశంలో పటాన్ చెరు పంచాయితీపై నటరాజన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులను కాపాడుకోవాలి కదా అంటూ మీనాక్షి పార్టీ నేతలకు చురకలు అంటిచారు. కాటా శ్రీనివాస్ తో మాట్లాడిన మీనాక్షి.. పార్టీ అన్నీ గమనిస్తోందని, కార్యకర్తలకు అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. సమావేశం ముగిసిన అనంతరం జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహతో (Damodara Rajanarsimha) మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పటాన్ చెరులో ఏం జరుగుతోదని వివరణ అడిగారు.

గూడెం వర్సెస్ కాటా:

పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud) మధ్య రాజకీయం భగ్గుమంటోంది. గత కాంగ్రెస్ తరపున కాటా శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గూడెం మహిపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత గూడెం కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వచ్చాక అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు, పంపకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని కాటా వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలు సందర్భాల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర నేతల దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఇటీవల కాటా వర్గీయులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసిన విషయం తీవ్ర దుమారం రేపింది. పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీకి అండగా నిలిచామని ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చి అసలైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని కాటా వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో తాజాగా మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేయడం పటాన్ చెరు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అందరూ సమన్వయంతో పని చేయాలని అల్టిమేటం జారీ చేయడంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా ఉండబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.

Next Story