బోర్డు ఎన్నికలపై ఏం చేద్దాం..?

by Dishanational1 |
బోర్డు ఎన్నికలపై ఏం చేద్దాం..?
X

దిశ, కంటోన్మెంట్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలపై దృష్టిసారించాయి. రాష్ట్ర సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ‘సెమీ ఫైనల్ ’గా అభివర్ణించే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో ఏలాగైనా విజయం సాధించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఇన్ చార్జీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం కంటోన్మెంట్ బోర్డు బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మారేడ్ పల్లిలోని తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వచ్చే బోర్డు పాలక మండలి ఎన్నికలలో విజయ ఢంకా మోగించేందుకు ఏం చేద్దామని మంత్రి అడిగి తెలుసుకున్నారు.

విజయమే లక్ష్యంగా..

ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం చేసినట్లు సమచారం. ఏప్రిల్ 30వ తేదీన బోర్డు ఎన్నికలు ఉన్నందున ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. అయితే ఐదు పర్యాలయాలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న ఇటీవల అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటు అయినప్పటికీ, ఆయన స్పూర్తితో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో నెగ్గాలని మంత్రి పేర్కొన్నట్లు తెలిసింది. పాత, కొత్త నేతలను కలుపుకుని వెళ్లాలని, ప్రజలలో ఉంటూ వారి సమస్యలపై పోకస్ చేయాలని తెలియజేసినట్లు సమచారం. కంటోన్మెంట్ లో రాష్ట్ర సర్కారు ద్వారానే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నట్లు ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్, ఉచిత తాగునీటి సరఫరా, అర్హులకు ఫింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబరాక్ తదితర పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు చెప్పాలని సూచించినట్లు తెలిసింది.

సర్వే ఆధారంగా టికెట్లు... మంత్రి తలసాని

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో సర్వే ఆధారంగానే టికెట్లను కేటాయిస్తున్నట్లు తలసాని ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన కంటోన్మెంట్ లో పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మల్కాజిగిరి పార్లమెంట్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తదితర ముఖ్య నేతలు హాజరవుతారని చెప్పారు. బోర్డు ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా వార్డులలో అభ్యర్థుల గుణగణాలు, అనుకూలతపై సమగ్ర సర్వే నిర్వహించి, అధిష్టానానికి నివేదిక పంపిస్తామని అన్నారు. అధిష్టానం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపు గుర్రాలకు టికెట్లను కేటాయిస్తుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి ఒత్తిడిలు పనిచేయవని, దీనిపై అపోహాలు వద్దని సూచించారు. కంటోన్మెంట్ లో 8 వార్డులకుగాను ఎనిమిది వార్డులను గెలిచేందుకు ప్రతి ఒక్కరం శ్రమిద్దామని, పార్టీ నిర్ణయాన్ని కూడా అందరు గౌరవించాలని తలసాని కోరారు. మంత్రితో సమావేశమైన వారిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీఎమ్మెల్యే సాయన్నకూమార్తెలు (మాజీ కార్పొరేటర్) లాస్యనందిత, నివేధిత, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్, నాయకులు అనంద్ బాబు, సదానంద్ గౌడ్, సంతోష్, పెద్దోళ్ల నర్సింహ యాదవ్ తదితరులు ఉన్నారు.

Next Story