మల్లారెడ్డిని చుట్టుముట్టిన భూ వివాదాలు.. ప్రజాభవన్ ఎదుట బాధితుల ఆందోళన

by Disha Web Desk 1 |
మల్లారెడ్డిని చుట్టుముట్టిన భూ వివాదాలు.. ప్రజాభవన్ ఎదుట బాధితుల ఆందోళన
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : మాజీ మంత్రి మల్లారెడ్డిని భూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. మల్లారెడ్డి తమ భూములను కబ్జా చేశాడంటూ బాధితులు రొడ్డేక్కుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను మల్లారెడ్డి కొల్లగొట్టారని బాధితులు రగిలిపోతున్నారు. ఈ ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్లతో పాటు ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేస్తున్నారు. 47 ఎకరాలను మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ మొన్న కేశవరం గ్రామస్తులు శామీర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. శుక్రవారం బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద వందల సంఖ్యలో బాధితులు ఆందోళనకు దిగారు. గుండ్ల పోచంపల్లిలో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

రోడ్డెక్కిన వందలాది బాధితులు..

మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి సర్వే నంబర్ 648/650లో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ సమస్యను విన్నవించేందుకు వందలాది సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సొసైటీలో తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి తమకు న్యాయం చేయాలని, మల్లారెడ్డి నుంచి తమ భూములను తిరిగి ఇప్పించాలని ప్లే కార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

కేశవరంలో రాజీకి యత్నం..

మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం భూ బాధితులతో మాజీ మంత్రి మల్లారెడ్డి రాజీ కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. కేశవరం గ్రామంలోని సర్వే నం.33, 34, 35లోని 47 ఎకరాల 18 గుంటల భూ కబ్జాపై ఇటీవల మల్లారెడ్డి, ఆయన అనుచరులు ఏడుగురిపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసుల నుంచి తప్పించుకునేందుకు బాధితులను ప్రలోభపెట్టి మాజీ మంత్రి, ఆయన అనుచరులు రాజీ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కాగా, కేశవరం గ్రామ సర్వే నం.33, 34, 35లోని 47 ఎకరాల 18 గుంటల భూమిని దాదాపు 40 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించింది. ఈ మొత్తం భూమి ఏడుగురి పేర్ల మీద ఉండగా.. వాళ్లంతా కాలం చేశారు. భిక్షపతి నాయక్ అనే వ్యక్తి మినహా వారి వారసులంతా ఇతర ప్రాంతాల్లో స్థిర పడ్డారు. ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి దాన్ని కాజేయాలని కుట్ర చేశారు.

తన అనుచరులు శ్రీనివాసరెడ్డి, హరిమోహన్ రెడ్డి, మధుకర్‌రెడ్డి, శివుడు, స్నేహరామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డి కేశవరం గ్రామంలోని భిక్షపతి నాయకులతో కలిసి మాట్లాడారు. ఆ భూమిని మొత్తం తమకు ఇప్పిస్తే.. డబ్బు ఇస్తామని ఆశచూపారు. సుమారు రూ.3 లక్షలు చెల్లించి దాదాపు రూ.250 కోట్ల విలువైన ఆ భూమిని పీటీ సరెండర్ చేయించుకుని ఈ ఏడాది నవంబర్3న ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ వ్యక్తి తమకు విక్రయించినట్లుగా తెల్లవారి రాత్రికి రాత్రే తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీళ్ల మోసాన్ని పసిగట్టిన భిక్షపతి నాయక్ ఆ భూమి వారసులకు సమాచారం ఇచ్చి గతేడాది నవంబర్18న శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు ఏడుగురిపై డిసెంబర్ 6న కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్ పేట సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్ అధికార పార్టీ అండతో రాత్రి 11 గంటలకు మూడుచింతలపల్లి తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ వాణి రెడ్డి అక్రమంగా 47.18 ఎకరాల భూమిని మాజీ మంత్రి అనుచరులపై రిజిస్టర్ చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా గతంలో ధర్నా నిర్వహించారు. తాజాగా మల్లారెడ్డి బాధితులంతా ప్రజాభవన్ ముందు ఆందోళన చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో అధికారం అండతో మేడ్చల్ జిల్లాలో వందల ఎకరాలను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరిపిస్తే మల్లారెడ్డికి చెందిన పలు భూ కుంభకోణాలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed

    null