స్కూలు స్థలాలూ వదలట్లే...!

by Sumithra |
స్కూలు స్థలాలూ వదలట్లే...!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: లే అవుట్లలో ఉండాల్సిన ఖాళీ స్థలాలు, పార్కు స్థలాలు దురాక్రమణకు గురవుతున్నాయి. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేసే ముఠాలు రెచ్చిపోతున్నాయి. లే అవుట్లలోని పార్కులు, ఖాళీ స్థలాలను వదలకుండా దొరికినంతా అక్రమించేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు, గ్రామాలలో ఈ అక్రమ దందా యధేచ్చగా కొనసాగుతోంది. పార్కు స్థలాలు, ఓపెన్ స్పేస్ లను కాపాడాల్సిన అధికార యంత్రాంగం అక్రమార్కులకు వంతా పాడుతోంది. తిలాపాపం తలపిడికేడు అన్న చందంగా కబ్జాదారులు విలువైన స్థలాలను అక్రమిస్తుంటే.. అధికారులు ఆ స్థలాలకు చట్టబద్ధత కల్పిస్తుండడం ఆందోళన కల్గిస్తోంది. ఘట్ కేసర్ అవుషాపూర్ లో లక్ష్మీ నగర్ కాలనీలో జరిగిన భూ కబ్జాపై వివరాలను ‘దిశ’ సేకరిస్తుండగా.. కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

స్కూలు స్థలం కబ్జా...

ఘట్ కేసర్ మండలం అవుషాపూర్ గ్రామ పరిధిలో లక్ష్మీ నగర్ కాలనీలో 1984లో గ్రామ పంచాయితీ అనుమతితో లే అవుట్ వేశారు. ఈ లేవుట్ లో పార్కు, స్కూలు కోసం (ఓపేన్ స్పేస్ ) 2,400 గజాల స్థలాన్ని కేటాయించారు. దీంతో ఈ స్థలాన్ని గ్రామ పంచాయితీ తన అధీనంలోకి తీసుకొని చెట్లు నాటింది. అయితే లే అవుట్ వేసిన 35 ఏళ్ల తర్వాత అక్రమార్కుల కన్ను ఈ ఖాళీ స్థలంపై పడింది. భూముల ధరలు భారీగా పెరగడంతో ఈ స్థలాన్ని ఎలాగైనా కాజేయ్యాలని ప్లాన్ రచించారు. 2016వ సంవత్సరంలో స్కూలు కోసం కేటాయించిన స్థలాన్ని బి.సూర్య నారాయణ రాజు అనే వ్యక్తి విజయ ఎడ్యుకేషనల్ సొసైటీ(చింతల్) కింద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించాడు. ప్రస్తుతం. ఇలా పార్కు, స్కూల్ కోసం కేటాయించిన రూ. కోట్ల విలువైన ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడు.

అధికారుల సహకారం..

లే అవుట్ లోని ప్రభుత్వానికి కేటాయించిన ఖాళీ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు కట్టబెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1984లో వేసిన లే అవుట్ లో స్కూల్ కు కేటాయించిన స్థలాన్ని అక్రమంగా వ్యవసాయతర భూమిగా స్థానిక తహసీల్దార్, ఆర్డీఓలు మార్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా అవసరాల కోసం వదిలిన స్కూల్ స్థలానికి నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏ ఎల్ ఆర్ ఎస్ కట్టించుకోవడం గమనార్హం. 1984లో జీపీఏ తీసుకున్న వ్యక్తి ఎలాంటి చట్టబద్దత లేకుండా స్కూల్ స్థలాన్ని విక్రయించాడు. లే అవుట్ లో ప్రజల అవసరాల కోసం కేటాయించిన 10 శాతం స్థలంలో స్కూల్ కు కేటాయించిన భూమి ఉందని కోర్టులో నిరూపించడంలో జిల్లా పంచాయితీ అధికారులు విఫలమవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా ఒక్కో శాఖ అధికారులు అక్రమార్కులకు సహకరిస్తూ.. మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.

అక్రమణలపై విచారణ జరుపాలి- వై.సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ, ఘట్ కేసర్ మండలం

అవుషాపూర్ లోని లక్ష్మీనగర్ లే అవుట్ జీపీఏ హోల్డర్ లింగారెడ్డి అక్రమాలపై ప్రత్యేక విచారణ జరిపించాలి.ప్రభుత్వానికి కేటాయించిన రూ. కోట్ల విలువైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అక్రమార్కులకు సహకరించిన అధికార యంత్రాంగంపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇంత పెద్ద భూ కుంభకోణం జరుగుతున్నా.. అధికార యంత్రాంగం వారికి సహకరించడం ఏ మాత్రం అక్షేపనీయం కాదు. విచారణ చేపట్టాలని ఈ నెల 10వ తేదీన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పటివరకు అధికారులు స్పందించడంలేదు.



Next Story

Most Viewed