తూంకుంట పురపాలికలో జబర్దస్తీగా..వసూళ్లు...!

by Disha Web Desk 12 |
తూంకుంట పురపాలికలో జబర్దస్తీగా..వసూళ్లు...!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరైనా నిర్మాణాలు చేపడుతున్నారంటే కౌన్సిలర్లు అక్కడ వాలిపోతున్నారు. మాకేం లేదా... మాతో కలువకుండా ఎలా కట్టేస్తున్నారంటూ బెదిరింపులకు దిగుతున్నారు. భవన యజమానుల నుంచి రూ.వేలు, రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా కొందరు బంధువులను నమ్మస్తులను కలెక్షన్ల కోసం రంగంలోకి దించుతున్నారు. డబ్బులివ్వకపోయినా, తప్పించుకు తిరుగుతున్నా అంతే సంగతులు.. అక్రమ నిర్మాణమని అధికారులకు ఫిర్యాదు చేయడమే కాదు. దగ్గరుండి కూల్చి వేస్తున్నారు. దీంతో చాలా మంది అడిగినంత ఇస్తున్నారు. తూంకుంట పురపాలికలో ఇప్పుడు ఈ దందా యధేచ్చగా సాగుతోంది.

వసూళ్ల జోరు..

తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయ్య పల్లి బిట్స్ ఫిలానీని అనుకొని ఉన్న వీకర్ సెక్షన్ ,దేవరయంజాల్ లోని మల్లన్న కాలనీలో వసూళ్ల దందా జోరుగా సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు, బంధువులు పేదలేవరైనా ఇల్లు కట్టుకుంటే చాలు అక్కడ వాలి పోతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 80 గజాల్లో స్లాబ్ వేస్తే రూ. లక్ష, రేకుల షెడ్డు వేసుకుంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వాపోతున్నారు. ఇంటి నెంబర్ కావాలంటే మరో రూ.50 వేలు అదనంగా సమార్పించుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మేము గరీబోళ్ళం.. మా వద్ద అంత డబ్బులు ఎక్కడివి, అప్పో... సప్పో చేసుకొని ఇంత నిలువ నీడ కోసం తండ్లాడుతున్నామంటే...అదంతా మాకు తెలియదు.. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే మున్సిపాలిటీ వాళ్లతో దగ్గరుండి కూల్చివేయిస్తామంటూ హుకుం జారీ చేస్తున్నారని పేరు చెప్పేందుకు ఇష్టపడని వీకర్ సెక్షన్ లో ఇల్లు కడుతున్న ఓ మహిళ వాపోయారు. అదేవిధంగా అధికారులకు కొంత మేర ముట్ట జెప్పుకోని రేకుల షెడ్డు వేసుకుంటే స్థానిక ప్రజాప్రతినిధికి ఇవ్వలేదని ఇటీవల తన ఇంటిని కూల్చి వేయించారని మల్లన్న కాలనీకి చెందిన ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

భర్తలదే డామినేట్...

తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో మహిళా కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కొందరు వారి భర్తలే డామినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా కౌన్సిలర్లను కేవలం సమావేశాలు, సభలు, ప్రొటోకాల్ కే పరిమితం చేస్తూ.. మిగతా వ్యవహారాలన్నీ భర్తలే చక్క బెడుతున్నారు. కొందరు భూ దందాలకు పాల్పడుతుండగా, మరికొందరు ఆయా వార్డులలో భవన నిర్మాణ దారుల నుంచి ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. భర్తలు చేసే అవినీతి, అక్రమాలతో మహిళా కౌన్సిలర్లు అప్రతిష్టపాలు అవుతున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో పాటు పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరు కౌన్సిలర్లు, మహిళ కౌన్సిలర్ల భర్తల అగడాలను కట్టడి చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై ఉందంటున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతి కౌన్సిలర్ల వల్ల పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.



Next Story

Most Viewed