కాంగ్రెస్‌లో దరఖాస్తుల కోలాహలం..గాంధీభవన్‌కు క్యూ కడుతున్న నేతలు

by Dishaweb |
కాంగ్రెస్‌లో దరఖాస్తుల కోలాహలం..గాంధీభవన్‌కు క్యూ కడుతున్న నేతలు
X

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ లో అసెంబ్లీ టికెట్ దరఖాస్తుల కోలాహలం మొదలైంది. అసెంబ్లీ సీట్ లను కన్ఫర్మ్ చేసుకునేందుకు బయోడేటాలతో గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారు.తమ తమ గాడ్ ఫాదర్ ల పైరవీలతో తమకే సీటు దక్కేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక , అంగబలాల ప్రదర్శన చేస్తూ ఎమ్మెల్యే సీటు కోసం దరఖాస్తులను అందజేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ బీ ఫార్మ్ తనకే దక్కాలనే పట్టుదలతో గాంధీభవన్ వర్గాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఈ సారి టికెట్ ఇస్తే గెలుపుతో తిరిగి వస్తా అంటూ పీసీసీ, ఏఐసీసీ దూతలను కలుస్తూ విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ముఖ్యంగా నలుగురు నేతలు టికెట్ కోసం కుస్తీ పడుతున్నారు.అయితే కాంగ్రెస్ టికెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న నేతలందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం.పీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపుతో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.దాదాపు రెండు సంవత్సరాలుగా నిత్యం ప్రజలలో ఉంటూ కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు కృషి చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ టికెట్ తనకే అనే ధీమాతో ఉన్నారు. కొద్ది నెలలుగా ప్రజా సమస్యలపై పాదయాత్ర ద్వారా ప్రతి బస్తీ తిరుగుతూ ప్రజలకు మరింత చేరువ అయ్యారు.

పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ వాదిగా ఉండడం తనకు కలిసి వచ్చే అంశంగా చూపిస్తూ, పార్టీ కష్టకాలంలో తాను అండగా నిలబడ్డానని తనకే టికెట్ ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వద్ద గట్టి పైరవీ నడుపుతున్నాడు.

పీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి కి నమ్మిన బంటుగా ఉంటూ అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సొంతంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువయ్యారు. కొంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్, పీసీసీ కార్యదర్శి జోష్నా శివారెడ్డి మహిళా అభ్యర్థిగా తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed