జేఎన్​టీయూహెచ్​లో విద్యార్థుల ఆందోళన..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

by Disha Web Desk 20 |
జేఎన్​టీయూహెచ్​లో విద్యార్థుల ఆందోళన..సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
X

దిశ, కూకట్​పల్లి : జేఎన్​టీయూహెచ్​ ఇంజనీరింగ్​ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం విద్యార్థులు వర్సిటీ రిజిష్ట్రార్​ మంజూర్​ హుస్సేన్​, కళాశాల ప్రిన్సాపాల్​ చాంబర్​ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు వర్షిత్​, గాదె పవన్​, రాహుల్ నాయక్​లు మాట్లాడుతూ ఇంజనీరింగ్​ కళాశాలలో రోజురోజుకు సమస్యలు పెరిగి పోతున్నాయని ప్రిన్సిపాల్​ విజయలక్ష్మీ సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కనీసం సమస్యలు విన్నవించుకునేందుకు వెళితే వినడం లేదని, సమయం ఇవ్వడం లేదని అన్నారు. సీఆర్​సీలో లిఫ్ట్​ పనిచేయక పోవడం కారణంగా దివ్యాంగులైన విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు.

హాస్టల్​, కళాశాలలో వైఫై సౌకర్యం లక్పించాలని అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కెమికల్​ ఇంజనీరింగ్ విభాగానికి ఇప్పటి వరకు నూతన భవనం నిర్మించలేదని అన్నారు. అదేవిధంగా గత ఆరు నెలల క్రితం స్టడి టేబుల్​, స్టడి చేయిర్​లు ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వలేదని అన్నారు. సమస్యలు చెబితే ఇది ప్రభుత్వ ఇంజనీరింగ్​ కళాశాల, ఇలాగే ఉంటుంది, ఎందుకు జాయిన్​ అయ్యారు ఇక్కడ అని ప్రిన్సిపాల్​ విద్యార్థులతో మాట్లాడుతు బెదిరిస్తున్నారని అన్నారు. వసతి గృహాలలో బాయిలర్స్​ పాడై 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మరమ్మతులు చేయించలేదని, ఉడికి ఉడకని అన్నం తింటున్నామని అన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ప్రిన్సిపాల్​కు విన్నవించుకుంటే హెచ్​ఓడీలకు చెప్పి బెదిరిస్తున్నారని అన్నారు. పై అధికారులకు సెన్స్​ లేదు, నిధులు కెటాయించడం లేదు నేనేం చేయాలంటు ప్రిన్సిపాల్​ వాదిస్తున్నారని విద్యార్థి నాయకులు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే తరగతుల బహిష్కరణ, విశ్వవిద్యాలయం బంద్​కు పిలుపు ఇవ్వాల్సి ఉంటుందని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. కళాశాల ప్రిన్సిపాల్​ చాంబర్​లో అందుబాటులో లేక పోవడంతో రిజిష్ట్రార్​ మంజూర్​ హుస్సేన్​కు వినతిపత్రాన్ని అందజేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శివకృష్ణ, బ్రహ్మం, ఆకాశ్​, రంజిత్​, మంజునాథ్​, సారథి, ఆకాశ్​, చందు, యశ్వంత్​, స్నేహిత్​ తదితరులు పాల్గొన్నారు.


Next Story