వైభవంగా ప్రారంభమైన శ్రీ మోతి మాత అమ్మవారి జాతర

by Web Desk |
వైభవంగా ప్రారంభమైన శ్రీ మోతి మాత అమ్మవారి జాతర
X

దిశ, ఝరాసంగం: భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ మోతి మాత అమ్మవారు. గిరిజనుల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పరపల్లి తాండలో వెలసింది. శ్రీ మోతి మాత అమ్మవారి 27వ జాతర ఉత్సవాలు ఆదివారం ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ప్రారంభమైన సందర్భంగా ఉప్పరపల్లి పరిసరాలు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, మహా మంగళహారతితో పాటు, గిరిజన మహిళలతో అమ్మవారికి ప్రత్యేక నైవేద్య నివేదన, ధ్వజారోహణ తదితరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రికి భజన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ మోతి మాత ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యం కోసం తాగునీరు, వైద్య ఆరోగ్య సౌకర్యాలు దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా జాతర ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామ్ రామ్ శెట్టి చౌహాన్, గౌరవ అధ్యక్షులు దేవిదాస్ జాదవ్, జహీరాబాద్ జడ్పిటిసి సభ్యులు నాకు శెట్టి రాథోడ్, ఇప్పలపల్లి సొసైటీ చైర్మన్ కిషన్ పవార్ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం

శ్రీ మోతి మాత జాతరలో భాగంగా సోమవారం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ముంబై ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది.

శ్రీ మోతి మాత క్షేత్రానికి చేరుకోవాలి ఇలా...

మొగుడంపల్లి మండలంలోని ఉప్పరపల్లి తండాలో వెలసిన శ్రీ మోతి మాత ఆలయానికి ఈ విధంగా చేరుకోవచ్చు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వైపు నుండి వచ్చే వారు అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర నుండి వచ్చే వారు జహీరాబాద్ చేరుకోవాలి. అక్కడి నుండి మొగుడంపల్లీ మీదుగా ఆటోలు, బస్సులు, ఉప్పరపల్లి మోతి మాత ఆలయానికి చేరుకోవచ్చు...పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు కర్ణాటక, మహారాష్ట్ర, బస్సులు జహీరాబాద్‌కు రాకపోకలు సాగుతున్నాయి.



Next Story