రేషన్ పరేషాన్.. సమయం గడుస్తున్నా సిగ్నల్ జాడే లేదు

by Dishanational2 |
రేషన్ పరేషాన్.. సమయం గడుస్తున్నా సిగ్నల్ జాడే లేదు
X

దిశ, చిన్నశంకరంపేట : రేషన్ దుకాణాలలో సరుకుల పంపిణీ‌కి సర్వర్ డౌన్ అయింది. రేషన్ షాపుల వద్ద ఒక్క దుకాణంలో రోజుకు పది మందికి మించి సరకులు ఇవ్వలేక పోతున్నామని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 29 గ్రామాలలో రేషన్ షాపుల వద్ద రోజుకు పది మందికి మించి సరుకులు అందడం లేదు. దీంతో వినియోగదారులను సర్ది పుచ్చ లేక సతమతమవుతున్నారు. మండలంలో ప్రతి గ్రామంలో ఇదే పెద్ద సమస్యగా మారింది. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. సర్వన్ డౌన్ తో గంటల తరబడి రేషన్ షాపుల వద్ద వినియోగదారులు గుమిగూడి పోతున్నారు, కొన్నిచోట్ల డీలర్లతో ఘర్షణ పడుతున్నారు. ప్రజలు అన్ని పనులు వదిలేసి రేషన్ షాపుకు వస్తే వట్టి చేతులతో తిరిగి పోతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. రేషన్ బియ్యం కోసం ప్రజలు దుకాణాలకు వెళ్తారు కానీ ఒక్కొక్క కార్డు ట్రాన్సక్షన్ కు అరగంట పడుతుందని, సర్వన్ నుంచి సిగ్నల్ రాని కారణంగా ఆలస్యమవుతుందని డీలర్లు మొత్తుకుంటున్నారు. ఈ సమస్యను పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఐదు రోజుల క్రితం తెలియజేసినా ఫలితం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సిగ్నల్ ఏర్పాటు చేసి వినియోగదారులకు సరుకులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed