మృత్యువుతో పోరాడి గెలిచిన సారిక

by Disha Web Desk 1 |
మృత్యువుతో పోరాడి గెలిచిన సారిక
X

మృత్యువుతో పోరాడిన గెలిచిన సారిక

చిన్నారికి తిరిగి ఊపిరి పోసిన జీజీహెచ్ వైద్యులు

అభినందించిన మంత్రి హరీశ్ రావు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : 'అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు' అన్న మాటను నిజం చేసి చూపించారు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు. మృత్యువుతో పోరాడుతున్న ఓ చిన్నారికి సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అనుబంధ మెడికల్ కళాశాలకు చెందిన వైద్యులు ఊపిరి పోసి పునఃర్జన్మను ప్రసాదించారు. చిన్నారి బంధువులు వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నీల రాములు కుమార్తె సారిక (8) ఈ నెల 1న ఇంటి వద్ద ఆడుకుంటుండగా కట్లపాము కాటు వేసింది.

కాసేపటి తర్వాత గమనించిన తల్లిదండ్రులు సారికకు పాము కరిచిందని గుర్తించి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో వెంటనే పరీక్షించిన పీడియాట్రిక్ వైద్యుడు సురేష్ బాబు ఐసీయూకు తరలించి చికిత్సను అందిచారు. వారం రోజుల పాటు ఐసీయూలో వెంటిలేటర్ పై చిన్నారికి చికిత్స అందించి, చిన్నారి సారిక పూర్తిగా కోలుకోవడంతో 12 రోజులు అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్ వైద్యుడు సురేష్ బాబు మాట్లాడుతూ.. చిన్నారి సారిక దాదాపు అపస్మారక స్థితిలోకి వెళ్లిందని , దీంతో వెంటనే పరీక్షించి ఐసీయూకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

పాము కరవడంతో న్యూరోటాక్సిక్‌ దశలో చిన్నారి సారిక ఉన్నట్లు గుర్తించామన్నారు. చిన్నారికి బ్రెయిన్ తో పాటు నరాలన్నీ దాదాపు చర్చబడిపోయాయని దానికి సంబంధించిన చికిత్సను వెంటనే ప్రారంభించామన్నారు. ఏడు రోజుల పాటు ఐసీయూలో సంబంధించిన క్లినికల్ చికిత్స నిర్వహించినట్లు వివరించారు. ఏడు రోజుల తర్వాత ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించి శుక్రవారం పూర్తిగా కోల్పోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు ఆయన తెలిపారు. చిన్నారి సారికకు చికిత్స నందించిన వైద్యులు గ్రీష్మ, రవి, వేణు, సిబ్బందికి మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


Next Story