జహీరాబాద్ మున్సిపాలిటీలో విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య సిబ్బంది..

by Disha Web Desk 20 |
జహీరాబాద్ మున్సిపాలిటీలో విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య సిబ్బంది..
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ మున్సిపాలిటీలో 150 మంది పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాలు కనుమరుగయ్యాయి. దీంతో సుమారు రూ.72 లక్షలకు పైగా సొమ్ముపై క్లారిటీ దొరకని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై మున్సిపల్ అధికారులను ఎన్నిసార్లు సంప్రదించిన సరైన సమాధానం రాకపోవడంతో రెండు రోజులుగా విధులను బహిష్కరించారు. స్థానిక మున్సిపాలిటీలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తారు. వీరి నుంచి మున్సిపాలిటీ ప్రతినెల ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాల కింద సరాసరి రెండు వేల వరకు కట్ చేసుకుంటారు. కానీ వారి ఈఎస్, ఐపీఎఫ్ ఖాతాలో వాటిని జమ చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఖాతాలను పరిశీలించిన కార్మికులకు డబ్బులు కనిపించడం లేదు. ఈఎస్ఐ వైద్యసేవలకు కూడా కార్మికులు నోచుకోవడం లేదు.

రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం సొంత అవసరాల నిమిత్తం ఖాతాలోని డబ్బులు ఉపసంహరించుకున్నారు. అదే ఖాతాలో మరో రెండు సంవత్సరాలుగా కార్మికుల వద్ద కట్ చేసిన డబ్బులు జమచేసినట్లు అధికారులు పేర్కొన్నప్పటికీ ఖాతాలో మాత్రం కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకున్న ఆ సంవత్సరానికి క్లోజ్ చేసిన ఖాతాలో అధికారులు డబ్బులు వేయడంతో కార్మికులు తీసుకోవడానికి వీలుకావడం లేదని వారు వాపోతున్నారు. ఇదిలా ఉండగా మరో 50 మంది కార్మికులకు సంబంధించి ఆరు నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులు వేతనాల్లో నుంచి మినహాయించుకున్నప్పటికీ వారి వారి ఈఎస్ఐ పీఎఫ్ ఖాతాలో మున్సిపల్ అధికారులు జమ చేయడం లేదని ఆరోపిస్తున్నారు.

ఇలా పారిశుధ్యం విభాగంలో పనిచేస్తున్న 150 మంది కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాలు ఏమైనట్లు, వారి డబ్బులు ఎటు పోయినట్లు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తమ డబ్బు ఎవరి ఖాతాలో జమా చేసారు, వాటిని తీసుకోవడం ఎలా ఏదైనా సమస్య వస్తే తమనెవరో ఆదుకుంటారని వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో రెండు రోజులుగా కార్మికులు పారిశుధ్యం పనులు మానేసి ఆందోళన చేపట్టారు. తాత్కాలికంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పినప్పటికీ రెండు రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకుంటే తిరిగి ఆందోళన చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు బాధ్యతగా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారి ఖాతాలను పునరుద్ధరించి ప్రతి ఒక్క కాంటాక్ట్ కార్మికునికి ఈఎస్ఐ కార్డులు అందజేయాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది.


Next Story