బీఆర్ఎస్ తో ప్రగతి.. బీజేపీని నమ్ముకుంటే అదోగతి : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
బీఆర్ఎస్ తో ప్రగతి.. బీజేపీని నమ్ముకుంటే అదోగతి : మంత్రి హరీష్ రావు
X

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద 250మందికి స్కూటీల పంపిణీ

దిశ, పటాన్ చెరు: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మి రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని, కేంద్రంలోని బీజేపీని నమ్మితే ప్రజలను అదోగతి పాలు చేస్తుందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని మైత్రి గ్రౌండ్ లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద 250 మంది దివ్యాంగులకు స్కూటీలు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలిసిన ఎమ్మెల్యే గూడెం ఏ కార్యక్రమం సంచలనంగా, వినూత్నంగా నిర్వహిస్తారని తెలిపారు.

అనునిత్యం ప్రజా శ్రేయస్సు కై తపిస్తూ అటు అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. గతంలో నియోజకవర్గంలో విద్యార్థులందరికీ వారికి కావలసిన పుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం దివ్యాంగుల జీవితాల్లో వెలుగుల నింపేలా రూ.3 కోట్ల రూపాయలతో 250 మంది దివ్యాంగులకు స్కూటీలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

ఈ స్కూటీల పంపిణీ ద్వారా దివ్యాంగులకు కొండంత ధైర్యాన్ని నింపడమే కాకుండా వారి జీవితంలో గుణాత్మక మార్పు తెస్తుందని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు నెలకు రూ.3,016 రూపాయల పెన్షన్ అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదానీలకు సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచుతూ మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శలు గుప్పించారు.

ఒకప్పుడు పటాన్ చెరు ప్రాంతం కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటే నేడు కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధికి చిరునామాగా మారిందన్నారు. పటాన్ చెరు రూపు రేఖల్ని మార్చేలా 200 ఎకరాల్లో కాలుష్య రహిత సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్, శివనగర్ లో ఎల్ఈడీ పార్క్, హైదరాబాద్ కు పరిమితమైన ఐటీ పరిశ్రమలు పటాన్ చెరు నియోజకవర్గంలోని ఉస్మాన్ నగర్ వరకు విస్తరించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. త్వరలో రూ.250 కోట్లతో పటాన్ చెరు లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు.

ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ప్రజలు వైద్యం కోసం అపోలో, యశోద వంటి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అత్యంత వివక్షతకు గురైతున్న దివ్యాంగులకు భరోసా కల్పించే లక్ష్యంతో 250 మందికి ద్విచక్ర వాహనాలను అందిస్తున్నామన్నారు. గడప దాటాలంటే మరొకరిపై ఆధారపడి దివ్యాంగుల జీవితాల్లో మార్పు తేవాలనే సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆశీస్సులు మంత్రి హరీష్ రావు సహకారంతో పటాన్ చెరు లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 200 మంది ఐకేపీ మహిళ ఉద్యోగులకు యూనిఫాం, ఐడీ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed