పార్టీకి ప్రజలే బలం.. బలగం : టీఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్

by Disha Web Desk 1 |
పార్టీకి ప్రజలే బలం.. బలగం : టీఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్
X

బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాసులు

పగటి కలలు కంటున్న బీజేపీ నాయకులు శ్రీనివాస్

దిశ, సంగారెడ్డి : బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలం.. బలగమంటూ సీఎం కేసీఆర్ నమ్మారని, ప్రజలు శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన నడుస్తోందని తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవెలపమెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ అన్నారు. బీఆర్ఎస్ కు ప్రజలే బాసులని, పార్టీకి ఎవ్వరూ బాసులు లేరని నమ్మి సీఎం కేసీఆర్ సంపద పెంచుతూ అందరికి పంచుతున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.

ప్రజల కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ మత విద్యేషాలు రెచ్చగొడుతూ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణను కోల్పోయిందని, ఆ పార్టీకి చెందిన కొందరూ నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇంత అభివృద్ధి జరిగేది కాదని అంటున్నారని తెలిపారు. ప్రజల కొరకు పనిచేసే పార్టీని ఆదరించాలని పిలపునిచ్చారు.

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది బీజేపీ : టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రాన్ని త్వరగా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే 1,200 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని , ఆ పాపం కాంగ్రెస్ పార్టీదేనని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ పెట్టారని అందులో ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మొత్తం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను పెంచిందన్నారు. రైతు రాజ్యమని చెప్పిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు.

రైతులకు రైతుబంధు, రైతుబీమా.. కనీసం రైతు భరోసా కల్పించారా అన్ని విమర్శించారు. ఫించన్లు రూ.200 ఇస్తే సీఎం కేసీఆర్ రూ.2 వేల చేశారని కొనియాడారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో మత విద్యేషాలను రెచ్చగొడుతుందన్నారు. బీజేపీ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి ఎనలేని భారాలను మోపిందని విమర్శించారు. ఆ ధరల పెరుగుదల వల్ల అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలు చేశారని అన్నారు.

అదే విధంగా అమిత్ షా మైనారిటీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ మత విద్యేషాలు పెంచుతున్నారని, ప్రజలు గమనించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రశాంత వాతారణాన్ని చెడగొడుతోందని ఆరోపించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ వల్లే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలు వచ్చాయని కొనియాడారు. సంగారెడ్డిలో ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించాలని సూచించారు.

ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ముస్తఫా, సంగారెడ్డి జడ్పీటీసీ సునీతా మనోహర్ గౌడ్, కంది జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్ రెడ్డి, చక్రపాణి, అమీరుద్దీన్, వెంకటేశ్వర్లు, చింతా సాయికుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed