దేశ ప్రజలను మోసం చేస్తున్న మోదీ సర్కారు: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి

by Disha Web Desk 1 |
దేశ ప్రజలను మోసం చేస్తున్న మోదీ సర్కారు: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి
X

దిశ, చేర్యాల: దేశ ప్రజలను మెసం చేస్తున్న మోదీ సర్కారు తీరుపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని, సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సీపీఐ నేత చాడ నేతృత్వంలో సాగుతున్న ప్రజా చైతన్య యాత్ర మంగళవారం చేర్యాలకు చేరుకుంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.

అనంతరం గాంధీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభకు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ బ్రిటీష్ వలస పాలనలో 1920 సంవత్సరంలో కార్మికులు స్థాపించారని తెలిపారు. గ్రామాల నుంచి మొదలు కొని మండలాలు జిల్లాలు, రాష్ట్రాలు ఇలా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సీపీఐ పార్టీ ఉన్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ పట్ల మతతత్వ పార్టీ బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థల ద్వారా దాడులు చేయిస్తూ కేసులు పెట్టించడం వారికి పరిపాటిగా మారిందన్నారు. దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా వరకు నేర చరిత్ర కలిగి ఉన్నారని ఆరోపించారు. సీపీఐకి జాతీయ హోదా పోతే, కిరీటాలు ఏమి పోవనీ సీపీఐ పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేస్తామన్నారు.

చేర్యాల ప్రాంత ప్రజలు గత కొన్నాళ్లుగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని పోరాడుతున్నారని వారి చిరకాల కోరికను సీఎం కేసీఆర్ స్పందించి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పల్లె పల్లెకు సీపీఐ ప్రజల వద్దకు సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో సీపీఐని మరింత బలోపేతం చేసి ప్రజా పోరాటాల నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద పవన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాండ్ర సదానందం, గడిపే మల్లేష్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed