మంజీరా కుంభమేళా ఏర్పాట్లు పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

by Disha Web Desk 20 |
మంజీరా కుంభమేళా ఏర్పాట్లు పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
X

దిశ , సంగారెడ్డి : న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ పంచవటీ క్షేత్ర పరిసరాల్లో జరిగే గరుడ గంగ పూర్ణమంజీరా కుంభమేళాకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈ నెల 22 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆయా శాఖల జిల్లా అధికారులు, జహీరాబాద్ డివిజన్ అధికారులతో కుంభమేళ ఏర్పాట్ల పురోగతి పై జిల్లా ఎస్పీ రమణ కుమార్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 24 నుండి జరగనున్న కుంభమేళాకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే సాధువులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు ప్రణాళికతో పూర్తి చేయాలన్నారు. మంజీరా నదిలో భక్తుల కోసం స్నానఘట్టాలు ఏర్పాటు చేయాలన్నారు.

మహిళలు, పురుషులకు వేరువేరుగా షవర్స్ ఏర్పాటు చేయాలని, వాటర్ ఫ్రెష్ గా వచ్చేలా చూసుకోవాలనీ, మహిళలు బట్టలు మార్చు కునేందుకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలనీ,24 గంటలు నీటి సరఫరా ఉండాలని త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలని, షిఫ్టుల వారిగా పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలని డిపిఓ కు సూచించారు. కుంభమేళాకు కర్ణాటక, మహారాష్ట్రల నుండి హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపాలని, అదేవిధంగా అదనపు బస్సులను నడపాలని ఆర్టీసీ ఆర్ఎం కు సూచించారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

నది తీరాన గజ ఈతగాళ్ళ ను బోట్లతో సహా ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు. మద్యం అమ్మకాలు జరగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారికి ఆదేశించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయమై రోజుకు ముగ్గురు చొప్పున వెళ్లి తనిఖీ చేసేలా చర్యలు చేపట్టాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సూచించారు. గుడికి సంబంధించి అలంకరణ, సైన్ బోర్డ్స్ ఏర్పాటు, చుట్టుపక్కల ముళ్ళ పొదల తొలగింపు, రూట్ వారీ డైరెక్షన్స్ ఉండేలా రూట్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆర్డిఓ రమేష్ బాబుకు సూచించారు. ఆయా శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కుంభమేళాను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుదర్శన్, డీపీవో సురేష్ మోహన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, నీటిపారుదల, విద్యుత్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, ఎక్సైజ్, మహిళా శిశు సంక్షేమ, మత్స్య శాఖల జిల్లాఅధికారులు, జహీరాబాద్ నారాయణఖేడ్ రెవిన్యూ డివిజనల్ అధికారులు రమేష్ బాబు, అంబాదాస్, డీఎస్పీలు, న్యాల్కల్ మండల తహసీల్దార్ అంటోనీ, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed