గజ్వేల్‌లో డబుల్ లొల్లి

by Dishanational1 |
గజ్వేల్‌లో డబుల్ లొల్లి
X

సొంతింటి కల నెరవేరలేదని లబ్ధిదారులు మరోసారి ఆందోళనకు దిగారు. మంగళవారం గజ్వేల్​ లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ పేర్లు రాలేదని బాధితులు నిరసన తెలిపారు. మనస్తాపానికి గురై ఓ యువకుడు పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకొని ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​ గజ్వేల్​ కు 1250 డబుల్​ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయగా ఐదారెండ్లుగా లబ్ధిదారులను ఎంపిక చేయకుండా అధికారులు నాన్చారు. గతంలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల పట్టాలివ్వగా ఆందోళన వ్యక్తమవడంతో వాటిని రద్దు చేసి మరోసారి లాటరీ ప్రక్రియను చేపట్టారు. అయితే రెండవ సారి ఎంపిక ప్రక్రియలో 3 వేల దరఖాస్తులు పెరగడంతో 1550 మందిని అర్హులుగా గుర్తిస్తూ ఈ నెల 19న జాబితా విడుదల చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అర్హులు 450 మంది ఆందోళనకు దిగారు. ఏకంగా ఓ యువకుడు నిప్పంటించుకునే ప్రయత్నం చేయడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పోలీసులు కలుగజేసుకొని ఆందోళనకారులను అరెస్టు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

దిశ, ప్రజ్ఞాపూర్: సొంత ఇంటి కల గజ్వేల్ పేదలను మరోసారి ఆందోళన గురిచేసింది. ఇండ్ల కేటాయింపు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడంతో ఇల్లు రాని పేదలు ఆందోళనకు దిగారు. రెండు దశాబ్దాలుగా సొంత ఇంటి కలలుగంటున్న గజ్వేల్ పట్టణ పేదల్లో పలువురికి నిరాశే మిగిలింది. అర్హుల జాబితా పెంచడం లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం పలువురు పేదలకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అధికారులు సర్వే నిర్వహించి అనర్హులను పక్కకు పెట్టవలసింది పోయి లాటరీ పద్ధతి నిర్వహించి చేతులు దులుపుకోవడం వల్ల నిజమైన పేదలు, అర్హులకు అన్యాయం చేసినట్లే అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పట్టణ నిరుపేదల కోసం సొంత ఇంటి కల నిజం చేయడానికి 1250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేశారు. అప్పట్లో రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల కేటాయింపు చర్చనీయాంశమైంది. ఐదారేండ్లుగా ఇళ్ల కేటాయింపు జరగకుండా నాన్చడంతో మున్సిపాలిటీ ఏర్పడడం విలీన గ్రామాలతో పరిధి పెరగడంతో పేదల సంఖ్య పెరిగింది. గతంలో ఇచ్చిన పట్టాలను రద్దుచేసి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి అధికారులు చేపట్టిన ఎంపిక ప్రక్రియ వివాదాలకు దారితీసింది. గతంలో 1100 మందిని లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ప్రాథమిక జాబితాను మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు చెబుతూ బాధితులు ఆందోళనకు దిగారు. తర్వాత రీసర్వే చేస్తామని అర్హులు, నిరుపేదలు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. దీంతో మరికొంతమంది దరఖాస్తు చేసుకోగా 3000 వరకు దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. దీనిని స్క్రీనింగ్ చేసిన అధికారులు ఈనెల 19న 1550 మంది అర్హులుగా గుర్తిస్తూ మరో జాబితాను విడుదల చేశారు. కేసీఆర్ 1250 ఇళ్లు మంజూరు చేయగా అందులో 100 కు పైగా ఇండ్లను పట్టణంలో పలు రోడ్ల విస్తరణకు ఇండ్లు కోల్పోయినవారికి కేటాయించడానికి గతంలో ఒప్పందాలు కుదిరాయి.


పలువురి పేదలకు దక్కని అదృష్టం...

సోమవారం మహతి ఆడిటోరియంలో 1100 ఇండ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. దీంతో మరో 450 మంది అర్హులకు ఇల్లు దక్కలేదు. స్థానిక ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, గడ ఓ ఎస్ డి ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో లాటరీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక జాబితా ప్రకటించారు. చాలామంది పేదలకు లాటరీ పద్ధతిలో అదృష్టం దక్కలేదు. దీంతో వాళ్లకి డబుల్ బెడ్ రూం ఇండ్లు అందకుండా పోయాయి. 1550 మంది జాబితాను తయారుచేసి 1100 మంది లబ్ధిదారులను గుర్తించడంతో 450 మందికి ఇండ్లు దక్కకుండా పోయాయి. సుమారు మూడింట రెండంతల మందికి ఇల్లు దక్కడం.. మరో వంతు మందికి ఇల్లు దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. జాబితాను పెంచి డ్రా తీయడంతో చాలామంది అర్హులు నిరుపేదలైన వారికి ఇల్లు దక్కకపోవడం దురదృష్టంగా మారింది. అధికారులు పలు రకాల సర్వేలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇల్లు కేటాయిస్తే న్యాయం జరిగేదని బాధితులు వాపోతున్నారు.

బాధితుల ఆందోళనలు

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 450 మంది అర్హులకు ఇల్లు దక్కకపోవడంతో పెద్దపెటున ఆందోళన చేపట్టారు. డ్రా ముగియగానే మహతీ ఆడిటోరియంలోనే బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నాయకులు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు అధికార పార్టీ నాయకులకు శాపనార్థాలు పెట్టారు. తమ భూపట్టాలను లాక్కున్నారని రెండు మూడు సార్లు విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు ఉండగా లాటరీ పద్ధతిలో తమకు ఇల్లు కేటాయింపు జరగకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జాబితాను పెంచి అర్హులకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మహతి ఆడిటోరియం ఆవరణలో గంటకు పైగా నిరసనకారులు నిరసన చేపట్టగా అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. 14వ వార్డుకు చెందిన రహిమాన్ అనే యువకుడు తన తల్లి పేరు లాటరీ పద్ధతిలో రాకపోవడంతో మనస్థాపానికి గురై అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పట్టించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అడ్డుకోవడంతో పెట్రోలు రోడ్డుపై పడి నిప్పంటించుకునే క్రమంలో రోడ్డుపై పెద్దపెట్టిన మంటలు రేగడం కొద్దిసేపు కలకలం రేపింది. అనంతరం పోలీసులు కలగజేసుకొని ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.

అర్హులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో లాటరీ పద్ధతిలో ఇల్లు రాని అర్హులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తుందని, గజ్వేల్ లో అర్హుల జాబితా పెరగడం వల్ల ఇప్పుడున్న ఇండ్లను లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగిందన్నారు. మిగతావారికి ఇండ్ల స్థల పట్టాలను మంజూరు చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed