కాళేశ్వరం నీళ్లు ప్రతిపక్ష నాయకులకు కనబడటం లేదా: మంత్రి హరీష్ రావు ఫైర్

by Disha Web Desk 1 |
కాళేశ్వరం నీళ్లు ప్రతిపక్ష నాయకులకు కనబడటం లేదా: మంత్రి హరీష్ రావు ఫైర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: కాళేశ్వరం నీళ్లు ప్రతిపక్ష నాయకులకు కనబడటం లేదా అని.. వారిని కాలువల్లో ముంచితే నీళ్లు పారుతున్నాయా లేదా తెలుస్తుందని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధ్వర్యంలో 763 మంది రైతులకు మంత్రి హరీష్ రావు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడగళ్ల బాధిత రైతులకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు ప్రకటిస్తే.. పదివేలు చాలవంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సన్నాయి నొక్కులు నొక్కతున్నారని ఆరోపించారు.

బీజేపీ నేతలకు తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే, కేంద్రం నుంచి రూ.10వేలు అందిస్తే రెండు కలుపి రూ.20వేలు అందించి రైతులను అదుకున్న వారం అవుతామని ఆయన తెలిపారు. నల్ల చట్టాలు తెచ్చి ఎనమిది వందల మంది రైతుల ఉసురు తీసుకున్న బీజేపీ నేతలు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలో లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతుబీమా, నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు స్ఫష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ అమలవుతున్న పథకాలు అమలు అవుతున్నాయని సూటిగా ప్రశ్నించారు.

యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం చేతులెతేస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజ కొంటామని చెప్పినట్లు వివరించారు. తెలంగాణ మాదిరి సంక్షేమ పథకాలు తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని పక్క రాష్ట్రాల వారు అందోళనలు చేస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా యాసంగిలో 97లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ రైతు సంక్షేమ విధానలతో యాసంగిలో 56లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు ఆయన వెల్లడించారు. కాళేశ్వరం నీళ్లు రైతుల భూముల్లో పరవళ్లు తొక్కుతున్నాయని, ఈ ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెడితేనే నిధులు విడుదల చేస్తామని మెలిక పెడితే సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టమని తెల్చి చెప్పారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల వారు మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, జడ్పీ చైర్మన్ వేలేటి, రోజాశర్మ, సుడా చైర్మన్ మారెడ్డి, రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Next Story