జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. వారికి అన్యాయం జరిగితే డైరెక్ట్ నేనే వస్తా..

by Disha Web Desk 19 |
జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. వారికి అన్యాయం జరిగితే డైరెక్ట్ నేనే వస్తా..
X

దిశ, సదాశివపేట: పార్టీలకతీతంగా అభివృద్ధి జరగాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాలిటీలో అభివృద్ధికి నిధులు మంజూరు చేసారని తెలిసింది. సదాశివపేట పట్టణానికి 25 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని.. వాటిని ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రధానంగా ఈ పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని నిధులు ఖర్చు చేయాలని చెప్పారు. కమిషనర్ కృష్ణా రెడ్డి మిషన్ భగీరథ గురించి ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గుంతలు లేకుండా నీళ్లు పట్టుకునే రోజు వస్తే సంతోషమేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ రూ. 25 కోట్లు పట్టణ అభివృద్ధికి మంజూరు చేస్తే.. కాంగ్రెస్ హయాంలో కూడా కోట్ల రూపాయలు తెచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అని వివరించారు. నిధులు పార్టీలకు అతీతంగా పట్టణంలో 26 వార్డుల అభివృద్ధి కోసం సమానంగా కేటాయించాలని అన్నారు. ముఖ్యంగా సిద్దాపూర్ రోడ్డు శాశ్వత పరిష్కారం.. రాఘవేంద్ర కాలనీ రోడ్డు, అలాగే గాంధీ బొమ్మ దగ్గర ఉన్న (చౌరస్తా) నాలుగు వైపులా రోడ్లు వేయాలని మున్సిపల్ కమీషనర్, ఏఈలకు సూచించారు.

కాంగ్రెస్ కౌన్సిలర్లకు నిధుల విషయంలో అవకతవకలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్ని అబ్లిగేషన్స్ ఉన్న అందరితో సమానంగా కాంగ్రెస్ కౌన్సిలర్లకు నిధులు ఇవ్వాలన్నారు. లేదంటే నేనే స్వయంగా రావాల్సి వస్తుందని.. నా ప్రోటోకాల్‌ను ఎవరు అడ్డుకోలేరని అన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. సిద్దాపూర్ లో ఇండ్ల స్థలాలు సమస్యను సీఎం దృష్టి్కి తీసుకెళ్తానని తెలిపారు. ఎంత ఇబ్బందైన ఖచ్చితంగా 5500 మందికి ఇండ్ల జాగలు ఇప్పిస్తా.. సిద్దాపూర్, సదాశివపేట్ టౌన్ ప్రజలకు ఆ ఇండ్ల జాగలు ఇప్పించడం ఖాయం అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్ రాజేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Next Story