అధికారం అండతో జోరుగా అక్రమ మట్టి రవాణా...

by Disha Web Desk 20 |
అధికారం అండతో జోరుగా అక్రమ మట్టి రవాణా...
X

దిశ, మనోహరాబాద్ : అధికారమే అండగా చూసుకొని అధికార పార్టీ నాయకులు అక్రమ మట్టి దందాకు పాల్పడుతున్నారని కొండాపూర్, రంగాయపల్లి, ముప్పిరెడ్డిపల్లి, కూచారం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియాగా అవతారం ఎత్తిన అధికార పార్టీ నాయకులను అడ్డుకునే అధికారులే లేరా అని ప్రశ్నిస్తున్నారు. మండలంలోని కొండాపూర్ గ్రామశివారులో నూతనంగా టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రంగాయిపల్లి, కూచారం గ్రామాల శివారులలో ఉన్న ప్రభుత్వ భూముల నుండి అక్రమంగా రాత్రివేళల్లో మట్టిని తవ్వుతూ పదులకు పైగా టిప్పర్ల ద్వారా కొండాపూర్ పరిశ్రమలకు మట్టిని రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనీ ఆయా గ్రామాల ప్రజలు, యువకులు ఆరోపిస్తున్నారు.

మట్టి రవాణా పై ప్రశ్నిస్తే తాము అధికార పార్టీ నాయకులమని, అధికారులంతా తమకు అండగా ఉన్నారని బెదిరింపులకు గురి చేస్తున్నారనీ పలువురు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం ఒక వర్గం వారు నడిపిస్తున్న అక్రమ మట్టి టిప్పర్లను మరో వర్గం వారు అధికారులకు అప్పగించడంతో కేసులు నమోదు చేసి భారీ ఎత్తున జరిమాణాలు విధించారు. దీంతో ఆయా గ్రామాలలో గత రెండు రోజుల నుండి అక్రమ మట్టి మాఫియా నాయకులు పంచాయతీలు నిర్వహిస్తూ ఎప్పుడూ ఎలా మట్టిదందా చేయాలో తీర్మానాలు చేసుకుంటున్నారని ఆయా గ్రామస్తులు వాపోతున్నారు. ఇటీవల రంగయ్యపల్లిలో మట్టిని తరలిస్తున్న వారిని కొంతమంది అడ్డుకోగా ఆ వ్యక్తులను రక్తాలు వచ్చేటట్లు చితకబాదడంతో అక్రమార్కుల పై కేసులు నమోదయ్యాయి.

ఈ అక్రమ మట్టి దందా పై ఆయా గ్రామాలలో గ్రూపులుగా విడిపోయి పరస్పరం గొడవలు చేసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. ఈ గొడవల వల్ల గ్రామాలలో అశాంతి నెలకొందని, రాత్రి వేళల్లో దాడులకు పాల్పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆయా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మట్టి దందాను అడ్డుకొని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.



Next Story

Most Viewed