వందల కోట్ల అమీన్ పూర్ భూములు అన్యాక్రాంతం: పటాన్ చెరు కాంగ్రెస్ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 1 |
వందల కోట్ల అమీన్ పూర్ భూములు అన్యాక్రాంతం: పటాన్ చెరు కాంగ్రెస్ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్
X

దిశ, పటాన్ చెరు: అమీన్ పూర్ మున్సిపాలిటీ అక్రమాల పుట్టగా తయారైందని పటాన్ చెరు కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలు చెరువులకు కబ్జాపై మంగళవారం ఆయన ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమీన్ పూర్ ప్రాంతంలో జరుగుతున్న భూ కబ్జాలు అక్రమ నిర్మాణాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమీన్ పూర్ వందల కోట్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అమీన్ పూర్ నడిబొడ్డున ఉన్న శంభునికుంట చెరువు పూర్తిగా కబ్జాకు గురవుతోందన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మున్సిపల్ చైర్మన్ పాండురంగా రెడ్డి చెరువు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నాడని ఆరోపించారు. ఖాళీ స్థలం కనిపించడమే పాపం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నవ్య నుంచి అమీన్ పూర్ వెళ్లే దారిలో సర్వే నెం1056 ప్రభుత్వ భూమిని సైతం పక్కన ఉన్న సర్వే నెం.1004 పేరుతో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.

సర్వే నెం.1016 లోకి రోడ్డు కోసం ప్రభుత్వ భూమి అయిన సర్వే నెం.1000లో రోడ్డు వేశారని ఆరోపించారు. సర్వే నెం.1118లో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం చేస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ వెంచర్ల నిర్మాణం కొనసాగుతున్న హెచ్ఎండీఏ అధికారులకు కనపడడం లేదా అని విమర్శలు గుప్పించారు. రూ.వందల కోట్ల విలువైన భూములు కబ్జా అవుతుంటే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రతి సారి ప్రెస్ మీట్లు పెట్టి గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యేకు ప్రభుత్వ భూముల పరిరక్షణ పట్టడం లేదన్నారు.

ఈ అక్రమాల్లో ఎమ్మెల్యే వాటా ఎంత అని ప్రశ్నించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ భూముల్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే చెరువు స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని అధికారులకు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.అనంతరం అమీన్ పూర్ తహసీల్దార్ దశరధ్ కు వినతిపత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు లావణ్య శశిధర్ రెడ్డి, సునీత, మున్న, నాయకులు సుధాకర్, దుద్యాల రవీందర్, ప్రకాష్, మన్నె రవీందర్, రవి గౌడ్, సత్యనారాయణ, మహేష్, విజయ్, రమేష్, మహిపాల్ రెడ్డి, శంకర్, సిద్దు, భిక్షపతి, మల్లేష్, ఈశ్వర్ రెడ్డి, సతీష్, లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నరేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Next Story