బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం : మంత్రి హరీశ్ రావు

by Disha Web Desk 1 |
బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం : మంత్రి హరీశ్ రావు
X

దిశ, సంగారెడ్డి : బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని జూన్ 9న సంక్షేమ సంబరాల దినోత్సవం నాడు లాంఛనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం సంగారెడ్డి నుంచి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనగా, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీసీ కుల, చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం కింది రూ.లక్ష గ్రాంటుగా అందించటానికి జూన్ 9న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సాయం అందించాలన్నారు. జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన తరువాత విచారణ చేపట్టి ప్రతి నెలా దశల వారీగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బీసీ కుల వృత్తుల వారికి కుటుంబంలో ఒకరికి చొప్పున ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని, దీనిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జూన్ 14న నిర్వహించే వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి అదనంగా రూ.లక్ష నిధులు వైద్య శాఖ నుంచి విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. పండుగ వాతావరణంలో వైద్య శాఖ దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించారు.

ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు అవార్డులు అందించాలన్నారు. వైద్య శాఖలో పని చేసే మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేయాలన్నారు. సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ పథకం ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో నగేష్, డీ.ఆర్.డీ.వో శ్రీనివాసరావు, బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, డీడబ్ల్యూవో పద్మావతి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి, తదితరులు పాల్గొన్నారు.


Next Story