సీఎం నియోజకవర్గంలో రోడ్డెక్కిన రైతులు

by Disha Web Desk 1 |
సీఎం నియోజకవర్గంలో రోడ్డెక్కిన రైతులు
X

వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ అన్నదాతల ధర్న

దిశ, ములుగు : కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రయోజనం లేదంటూ గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. మంగళవారం సీఎం నియోజకవర్గంలోని మర్కుక్ మండల కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుండడంతో రైతులు రేయింబవళ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర, ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

మండలంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. కొనుగోలు మాత్రం మందకొడిగా కొనసాగుతోందన్నారు. అధికారులు ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావుడిగా కొనుగోలు కేంద్రాల ప్రారంభించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కాగా, అధికారులను అడిగితే, రైస్ మిల్లర్ల వద్ద అలాట్ మెంట్ లేకపోవడంతో లారీల కొరత ఏర్పడిందని, అందుకే ధాన్యం రవాణాలో ఇబ్బంది కలుగుతుందని తెలుపుతున్నారని రైతుల వాపోయారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం కుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగు పెద్ద మొత్తంలో సరఫరా చేయాలని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

మండే ఎండలు నెత్తిపైన పెట్టుకొని రైతుల పడిగాపులు కాయడం అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద గన్నీ బ్యాగులు లేక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే నిర్వాహకు స్పందించపోవడంతోనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పోటెత్తుతున్నాయని తెలిపారు. నిరసన స్థలానికి సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ గౌడ్ వచ్చి వాళ్లను సముదాయించగా.. తమకు న్యాయం జరిగే వరకు రోడ్డుపైనే బైఠాయిస్తాయని వాగ్వాగానికి దిగారు. రైతులకు న్యాయం చేకూర్చాలని బీజేపీ నాయకులు రైతులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎస్సై హరీష్ ఏవో నాగేందర్ రెడ్డి ఫోన్ చేసి ఘటన స్థలానికి పిలిపించి వారి సమస్యలు పరిష్కరించేలా హామీని ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళనను విరమించారు.


Next Story

Most Viewed