బీజేపీవి ఝూటా మాటలు.. తెలంగాణ దేశానికే ఆదర్శం : టీఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్

by Disha Web Desk 1 |
బీజేపీవి ఝూటా మాటలు.. తెలంగాణ దేశానికే ఆదర్శం : టీఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్
X

దిశ, సంగారెడ్డి : బీజేపీ పార్టీ సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ పేరిట డ్రామాలకు తెరలేపి ఝూటా మాటలు, పసలేని మాటలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారని తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్ పెంట్ కార్పోరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డిలోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.

సీఎం కేసీఆర్ సుభిక్షంగా, సస్యశ్యామల తెలంగాణకు అహర్నిషల్ కృషి చేస్తున్నారని కొనియాడారు. బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధిపై పస లేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించింది నిరుద్యోగుల సభ కాదని, రాజకీయ నిరుద్యోగుల సభ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని, మరో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారని తెలిపారు.

బీజేపీ నాయకులు వీటన్నింటి చూడకుండా నిరుద్యోగులను తప్పదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని, ఎలా మాట్లాడాలో కూడా తెలియదని విమర్శించారు. బండి మాట్లాడే భాషా... యాస ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడే భాషలా లేదన్నారు. సంగారెడ్డికి వచ్చి ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తామని హితవు పలికారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను ఊడుగొట్టారని ఆరోపించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని, లక్షలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోదీకే దక్కిందన్నారు.

అభివృద్ధిపై తప్పుడు ప్రచారం..

అదే విధంగా తెలంగాణలో అభివృద్ధి జరగలేదంటూ తప్పుడు ప్రచారాన్ని బండి సంజయ్ చేస్తున్నారని, అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రపంలోనే ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి రాష్ట్రంలో ఉన్న గుంట గుంటకు నీళ్లు అందిస్తున్న చరిత్ర సీఎం కేసీఆర్ దే అన్నారు.

మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు ఏ రాష్ట్రంలో లేదన్నారు. అదే విధంగా రైతు బంధు, రైతు భీమా ఏ రాష్ట్రంలోనైనా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా అని ప్రశ్నించారు. ఫించన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు రూ.1.95 కోట్లను ఇప్పించాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోందని, జహీరాబాద్ లో నిమ్జ్ పరిశ్రమ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు స్థానికులకు దక్కుతాయన్నారు. అదే విధంగా అభివృద్ధిపై కూడా చర్చకు రావాలని సవాలు విసిరారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కంది జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ ప్రభుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు డా.శ్రీహరి, పెరుమాండ్ల నర్సింలు, వాజిద్, శ్రావణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే.. ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బాలకిషన్


Next Story

Most Viewed