ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వాల ప్రోత్సాహం : అదనపు కలెక్టర్ వీరారెడ్డి

by Disha Web Desk 20 |
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వాల ప్రోత్సాహం : అదనపు కలెక్టర్ వీరారెడ్డి
X

దిశ, సంగారెడ్డి : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల ప్రోత్సాహం అందిస్తున్నాయని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి పథకం - తయారీ సంస్థల క్రమబద్ధీకరణ కింద జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టీఎన్జీవో భవనంలో ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యవసాయ ఆధారిత యూనిట్లను నెలకొల్పేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని సూచించారు. అర్హులైన వారికి ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుందన్నారు.

ఔత్సాహికులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేయాలని, దాంతో జిల్లాలో అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా ప్రజల అవసరాలకు సరిపడా ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వాలు వివిధ పథకాల కింద అందిస్తున్న తోడ్పాటు గురించి ఔత్సాహికులకు వివిధ శాఖల అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రశాంత్ కుమార్, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, ఉమ్మడి మెదక్ జిల్లా ఆయా శాఖల అధికారులు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ గోపాల్ రెడ్డి, నాబార్డ్ ఏ జీఎం, ఆర్డిఓ నగేష్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కన్సల్టెంట్ శేఖర్ రెడ్డి, జిల్లా ప్రతినిధి మణికంఠ, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, నిరుద్యోగ యువత, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed