ప్రగతి పథంలో దూసుకెళ్తున్న జిల్లా సంగారెడ్డి : హోంమంత్రి మహమూద్ అలీ

by Disha Web Desk 1 |
ప్రగతి పథంలో దూసుకెళ్తున్న జిల్లా సంగారెడ్డి : హోంమంత్రి మహమూద్ అలీ
X

మెడికల్ కళాశాలతో తీరిన జిల్లా ప్రజల కల

దిశ, సంగారెడ్డి : జిల్లా అన్ని రంగాల్లో సంగారెడ్డి జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధించిందని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలకు హోం మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పిమ్మట అమర వీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులర్పించారు. నగారా మోగించి బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసు వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి దిశగా పయనిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చొన రైతు బంధు, రైతు భీమా పథకాలు ప్రపంచ ఖ్యాతి పొందాయని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అని అన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రజల చిరకాల వాంఛ మెడికల్ కాలేజీని సంగారెడ్డిలో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నార్మల్ డెలివెరీల సంఖ్య పెరిగిందని వైద్య సిబ్బందిని అభినందించారు. అదే విధంగా పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రూ.70 కోట్లతో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నమని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని సుల్తాన్ పూర్ లో ఉన్న జేఎన్టీయూకు అనుబంధంగా యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్సెస్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రంగంలో జిల్లా శరవేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. అనంతరం తెలంగాణ కోసం అసువులు బాసిన జిల్లాకు చెందిన కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన భార్గవ్ తండ్రి నోముల సత్యనారాయణను మంత్రి సత్కరించారు.

అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ముఖ్యంగా బాలసదనం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. పటాన్ చెరు మండలంలోని చిట్కుల్, కర్దనూర్, రామేశ్వరం బండ, కంది మండలం ఎద్దు మైలారం గ్రామ పంచాయతీలు, జిల్లా పంచాయతీ కార్యాలయం హెచ్.వై.ఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా పొందిన ఐ.ఎస్.వో 9001- 2015 సర్టిఫికెట్లను ఆయా సర్పంచ్ లకు, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ కు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి , శాసనసభ్యులు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా ఎస్పీ రమణ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, జిల్లా అధికారులు, డీఆర్వో మెంచు నగేష్ , ఆర్డిఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, సర్పంచ్ లు, ప్రజలు, విద్యార్థినీవిద్యార్థులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed