త్యాగమూర్తులకు అండగా సీఎం కేసీఆర్

by Disha Web Desk 1 |
త్యాగమూర్తులకు అండగా సీఎం కేసీఆర్
X

ఎకరాకు రూ.13 లక్షల హామీని నిలబెట్టుకున్నారు

కోర్టులో సంతకాలు చేసిన 2వ టీఎంసీ బాధిత రైతులు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తొగుత కరువు కటకాలతో బీటలు వారిన తెలంగాణ లో గోదావరి జలాలు పారించి సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. సాగునీటి జలాలు రావాలంటే కొంత మంది రైతులు తమ పంట పొలాలను త్యాగం చేయాల్సి వస్తుంది. ఏళ్లుగా పంట పొలాలతో అనుబంధం ఉన్న రైతులు తమ భూమిని వదులుకోవడానికి ఎంతో త్యాగం చేయాల్సి ఉంటుంది.అంత త్యాగం చేసిన రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. గతంలో మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 2వ టీఎంసీ కాలువలో భూములు కోల్పోతున్న రైతులకు రూ.13 లక్షలు అందిస్తూ హామీని నిలబెట్టుకుంటున్నారు.

బుధవారం తొగుట మండలంలోని ఘనపుర్, తుక్కపూర్ రైతులు హైదరాబాద్ లోని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని ప్రత్యేక కోర్టులో రూ.5 లక్షల పరిహారం కోసం సంతకాలు చేశారు. వీరికి గతంలోనే ఎకరాకు రూ.8 లక్షల పరిహారం ఇచ్చిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. తొగుట మండలంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం మూలంగా వేల ఎకరాల్లో భూములు, ఐదు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. 50 టీఎంసీల సామర్ధ్యం ఉన్న మల్లన్న సాగర్ కు కేవలం ఒక్క టీఎంసీ కెపాసిటీ ఉన్న అండర్ గ్రౌండ్ ద్వారా తుక్కపూర్ పంప్ హౌస్ కు నీళ్లు వస్తున్నాయి.

ఒక్క టీఎంసీ ద్వారా వొచ్చే నీళ్లు సరిపోయే అవకాశం లేకపోవడంతో భూమిపైన మరో టీఎంసీ నీటిని తీసుకురావడానికి గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భూసేకరణ చేశారు. 2వ టీఎంసీ కోసం తుక్కాపూర్ లో 59 మంది రైతుల నుండి 52 ఎకరాలు, ఘనపుర్ లో 77 మంది రైతుల నుండి 64 ఎకరాలు, ఎల్లారెడ్డి పేటలో 220 మంది రైతుల నుండి 231 ఎకరాలు, బండారుపల్లి లో 175మంది రైతుల నుండి 156 ఎకరాల భూసేకరణ చేశారు. తొగుట మండల రైతులు మల్లన్న సాగర్ మూలంగా ఇప్పటికే నష్టపోవడంతో వారికి సరైన పరిహారం ఇవ్వాలని అప్పట్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన తన్నీరు హరీశ్ రావు ఎకరాకు రూ.13 లక్షలు అందిస్తామని తెలిపారు. అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా అదే విషయాన్ని రైతులకు తెలియజేశారు. 2013 చట్టం ప్రకారం పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వీలు లేకపోవడంతో ఉన్నంతలో గొప్పగా ఇప్పటికే ఆ గ్రామాల కాలువ ముంపు రైతులకు ఎకరాకు రూ.8 లక్షల చొప్పున అందించారు. అలాగే వ్యవసయేతర ఆస్తులకు సైతం బండారుపల్లిలో రూ.2.78 కోట్లు, ఎల్లారెడ్డి పేటలో రూ.1.10 కోట్లు, ఘనపుర్ లో రూ.88 లక్షలు, తుక్కాపూర్ లో రూ.39 లక్షలు చెల్లించారు.

మిగతా పరిహారం కోసం వారు కోర్టును ఆశ్రయించారు. అనుకున్న విధంగానే రైతులకు ఎకరాకు మిగతా రూ.5 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకోవడంతో బుధవారం హైదరాబాద్ లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని ప్రత్యేక కోర్టులో ఘనపుర్, తుక్కాపూర్ రైతులు సంతకాలు చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా వారిని కలిసి అభినందించారు. ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా ఎకరాకు రూ.13 లక్షల పరిహారం త్వరలో అందిస్తామన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ముంపు బాధితులకు పరిహారం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరిహారం అందిస్తున్నామన్నారు. మిగతా గ్రామలైన బండారు పల్లి, ఎల్లారెడ్డి పేట రైతులకు సైతం ఎకరాకు రూ.13 లక్షలు అందిస్తామన్నారు. మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆధ్వర్యంలో ముంపు బాధితులకు మంచి పరిహారం అందుతుందన్నారు. ఈ సందర్భంగా రైతులు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.

2వ టీఎంసీ కాలువ కు భూ సేకరణ సమయంలో హామీ ఇచ్చిన విధంగా రూ.13 లక్షల పరిహారం ఇవ్వడం సంతోషకరమన్నారు. మా త్యాగలతో వేల మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతులను అభినందించిన వారిలో సొసైటీ చైర్మన్ కె.హరికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు బోధనం కనకయ్య, ఎంపీటీసీ కొమ్ము శరత్, మాజీ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కుంభాల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed