పెండింగ్‌లో జహీరాబాద్, సంగారెడ్డి సీట్లు.. ఆ ఇద్దరిలో ఎవరికి బీ ఫామ్?

by Disha Web Desk 16 |
పెండింగ్‌లో జహీరాబాద్, సంగారెడ్డి సీట్లు.. ఆ ఇద్దరిలో ఎవరికి బీ ఫామ్?
X

దిశ, బ్యూరో, సంగారెడ్డి: అధికార బీఆర్ఎస్ పార్టీలో బీ-ఫారాల పంపిణీ ప్రక్రియ షురువైంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఆదివారం బీ-ఫారాలు అభ్యర్థులకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకుగాను ఏడుగురికి బీ-ఫారాలు ఇవ్వగా, మిగతా ముగ్గురికి అందజేయకపోవడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్లు మొదట ప్రకటించినప్పటికీ బీ-ఫారాలు మాత్రం అందించలేదు. దీంతో బీఆర్ఎస్‌లో ఏం జరుతోంది అని చర్చ మొదలైంది.

బీ-ఫారాలు అందుకున్న అభ్యర్థులు

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం పార్టీ అభ్యర్థులకు బీ- ఫారాలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో ఆయన అందరితో సమీక్ష నిర్వహించిన తరువాత అందజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, సిద్దిపేట మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి బీఫారాలు అందుకున్నారు. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇవ్వడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఇద్దరి పరిస్థితి..?

ఉమ్మడి జిల్లాలో ఏడు స్థానాలకు బీ ఫారాలు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్ మరో మూడుస్థానాలు పెండింగ్‌లో పెట్టారు. ఇందులో సంగారెడ్డి జిల్లా నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్ జిల్లా నుంచి నర్సాపూర్ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. నర్సాపూర్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మధన్ రెడ్డిని పేరు ఖరారు చేయకపోయిన విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇద్దరిలో ఎవరికీ బీ ఫామ్ ఇవ్వకపోవడంతో చర్చానీయాంశమైంది. మొదటి జాబితా సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ నుంచి మాణిక్ రావు పేర్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. బీ ఫామ్‌ల వరకు వచ్చే సరికి ఈ ఇద్దరి పేర్లను తప్పించడం రాజకీయంగా చర్చకు దారితీస్తున్నది. చింతా ప్రభాకర్, మాణిక్ రావులకు బీఫాములు ఇస్తారా..? లేదా ఆ స్థానాల్లో ఇతరులకు అవకాశం ఇస్తారా..? అనే చర్చ జరుగుతున్నది.


Next Story