24 గంటల విద్యుత్ మాటల వరకేనా..? విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు..

by Disha Web Desk 11 |
24 గంటల విద్యుత్ మాటల వరకేనా..? విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు..
X

దిశ, బెజ్జంకి: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నానమని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాటల వరకే పరిమితం చేశారని, ఎక్కడ చూసినా విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కిసా రత్నాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం విద్యుత్ కోతలకు నిరసనగా బెజ్జంకి మండల పరిధి బేగంపేట్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుందని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, ఎప్పుడు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు.

కేవలం 9 గంటల నుంచి 12 గంటల లోపు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. కాగా నెల రోజుల నుంచి విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వం నుంచి మెసేజ్ వస్తేనే రైతులకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పడం దారుణమని అన్నారు. వేసిన పంటలు ఎండే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటిస్తూ విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed