తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు: హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలక అధికారిణి

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-24 13:13:32  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు: హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలక అధికారిణి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మే 1, 2026 నుండి ఈ బదిలీలు అమల్లోకి రానున్నాయి.

శిఖాగోయల్ (1994): ప్రస్తుతం విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న శిఖాగోయల్‌ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అలాగే ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు.

దేవేంద్ర సింగ్ చౌహాన్ (1997): ఏడీజీ (పర్సనల్)గా ఉన్న ఈయనను డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్) గా నియమించారు.

డా.తరుణ్ జోషి (2004): ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న తరుణ్ జోషిని అత్యంత కీలకమైన ఫ్యూచర్ సిటీ (Future City) పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుత సీపీ సుధీర్ బాబు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.

అవినాష్ మొహంతీ(2005): మల్కాజిగిరి సీపీగా ఉన్న అవినాష్ మొహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయనకు ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

బీ. సుమతి (2006): ఐజీ (SIB)గా ఉన్న సుమతిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా నియమించారు.

షా నవాజ్ ఖాసిం (2003): డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న ఈయనను మల్టీ జోన్-II ఐజీపీగా బదిలీ చేశారు.

కార్తికేయ (2006): ఐజీపీ (ఇంటెలిజెన్స్) గా ఉన్న కార్తికేయకు ఐజీపీ (SIB) గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

రాష్ట్రంలో పాలనను మరింత వేగవంతం చేయడానికి, ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల భద్రతను పర్యవేక్షించడానికి అనుభవజ్ఞులైన అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా హోం శాఖలో శిఖాగోయల్ నియామకం, ఫ్యూచర్ సిటీకి తరుణ్ జోషి ఎంపిక వంటివి ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story