రాతి క్వారీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి

by Malleboina Mahesh |   (  Updated:2026-01-04 06:05:45  IST  )

అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ క్వారీ లో భారీ పేలుడు సంభవించడంతో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

రాతి క్వారీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ క్వారీ లో భారీ పేలుడు (Huge explosion) సంభవించడంతో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని ధెంకనల్ జిల్లా మోటంగ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పూర్ గ్రామం సమీపంలో ఉన్న ఒక రాతి క్వారీ (Stone quarry)లో శనివారం అర్ధ రాత్రి జరిగింది. రోజువారీ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడి కక్కడే మృతి చెందినట్లు సమాచారం. పేలుడు ధాటికి క్వారీలో పెద్ద ఎత్తున మట్టి, బండరాళ్లు విరిగిపడటంతో మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం

ఈ సమాచారం అందుకున్న వెంటనే మోటంగ పోలీసులు, ఒడపాడ తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ, రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ (Search operation) కొనసాగింది. ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF), ఫైర్ సర్వీస్ బృందాలు రంగంలోకి దిగి శిథిలాలను తొలగిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ (Former CM Naveen Patnaik) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడం తో పాటు, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్?

ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ క్వారీకి బ్లాస్టింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి సరైన అనుమతులు లేవని తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ క్వారీని మూసివేయాలని మైనింగ్ శాఖ నోటీసులు (Mining Department Notices) జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, నిబంధనలను బేఖాతరు చేస్తూ పనులు కొనసాగించడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మృతి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు మీడియా తెలిపారు.

Next Story