ప్రియాంకాగాంధీ సభకు భారీ ఏర్పాట్లు

by Disha Web Desk 7 |
ప్రియాంకాగాంధీ సభకు భారీ ఏర్పాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ ఈ నెల 8న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసేలా నేతలు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతోపాటు జిల్లాల నుంచి విస్తృతంగా జనాన్ని తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి నేతృత్వంలో టీఎస్పీఎస్సీ పేపర్స్ లీక్ పై పోరాట కమిటీ ఏర్పాటైంది. సభ నిర్వహణ ఏర్పాట్లలో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు.

ఈ సభకు అన్ని జిల్లాల నుంచి తరలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సభ సక్సెస్ కోసం నేతలకు ఇప్పటికే వర్క్ డివిజన్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు పెద్దఎత్తున సభకు వచ్చేలా పార్టీలోని అన్ని విభాగాల నేతలు చొరవ తీసుకోవాలని సూచించారు. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా కారణంగా పేపర్స్ లీక్ కావడంతో నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయని, వారికి అండగా ఉండేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ నెల 7న బీఎస్పీ అధినేత్రి మాయావతి రాష్ట్రంలో నిర్వహించే సభలో పాల్గొననుండగా, మరుసటి రోజునే కాంగ్రెస్ నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని చేపడుతుండడం గమనార్హం.

Next Story

Most Viewed