అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందేలా కృషి చేస్తాం : టీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ

by Ratna Kumari |

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో టీయుడబ్ల్యుజే- ఐజేయు ఎల్లప్పుడూ అగ్రభాగన ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు విర‌హ‌త్ అలీ పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందేలా కృషి చేస్తాం : టీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ
X

దిశ - మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యుజే - ఐజేయు) స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో టీయుడబ్ల్యుజే ఐజేయు ఎల్లప్పుడూ అగ్రభాగన ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రతి ప్రొఫెషనల్ జర్నలిస్టుకూ అక్రిడేషన్ :

క్షేత్రస్థాయిలో ఎండనక, వాననక కష్టపడి వార్తలు సేకరించే ప్రతి ప్రొఫెషనల్ జర్నలిస్టుకు ప్రభుత్వం నుంచి అక్రిడేషన్ కార్డు అందేలా యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని విరహత్ అలీ భరోసా ఇచ్చారు. అక్రిడేషన్ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.

డెస్క్ జర్నలిస్టులు ఆందోళన చెందవద్దు :

డెస్క్ జర్నలిస్టుల అక్రిడేషన్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు. "డెస్క్ జర్నలిస్టులకు ఎలాంటి అపోహలు వద్దు. ఐజేయు మీకు అండగా ఉంటుంది. డెస్క్ మీద పనిచేసే వారికి కూడా న్యాయం జరిగేలా నిబంధనల్లో అవసరమైన మార్పులు చేసేందుకు యూనియన్ శ్రమిస్తోంది" అని ఆయన వివరించారు.ఈ క్రమంలో యూనియన్ అద్యక్షుడికి డెస్క్ జర్నలిస్ట్ లు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

దశాబ్దాల పోరాట చరిత్ర :

దశాబ్దాల పోరాట చరిత్ర కలిగిన టీయుడబ్ల్యుజే (ఐజేయు), జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక విజయాలను సాధించిందని ఆయన గుర్తు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమం, వారి ఆరోగ్య భద్రత మరియు పిల్లల చదువుల విషయంలో యూనియన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు జిల్లా శాఖ సమన్వయంతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్,ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ హైమద్ పాష, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు కాటం నాగరాజు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story