మీ-సేవా జీపీఓ మొబైల్ యాప్' ద్వారా సేవలందించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

by Ratna Kumari |

మీ-సేవా మొబైల్ యాప్ లో లాగిన్ విధానం నేర్చుకొని, అప్ లోడ్ అయ్యే ఆదాయం, కుల, తదితర ధృవ పత్రాల సేవలను జీపీఓలు అందించాల‌ని క‌లెక్ట‌ర్ విజయేందిర బోయి ఆదేశించారు.

మీ-సేవా జీపీఓ మొబైల్ యాప్ ద్వారా సేవలందించాలి :   కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మీ-సేవా మొబైల్ యాప్ లో లాగిన్ విధానం నేర్చుకొని, అప్లోడ్ అయ్యే ఆదాయం, కుల, తదితర ధృవ పత్రాల సేవలను మీరే అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో, కొత్తగా నియమితులైన గ్రామ పాలనాధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మీ సేవా ద్వారా అప్లోడ్ అయ్యే ధృవ పత్రాల దరఖాస్తులు, గ్రామస్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్, ఆన్ లైన్ ద్వారా రెవెన్యూ ఇన్ స్పెక్ట‌ర్ డిఫ్యూటీ తహసీల్ధార్లకు ఎలా అప్డేట్ చేయాలి వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. గ్రామ పాలనాధికారులు తమకు కేటాయించిన క్లస్టర్ గ్రామాల్లో స్వంత కార్యాలయం ఏర్పాటు చేసి గ్రామస్తులకు అక్కడిక్కడే సేవలు అందించాలని ఆమె ఆదేశించారు.

సమగ్రంగా పరిశీలన చేయాలి

కుల, ఆదాయ, తదితర ధృవ పత్రాలు జారీ చేసే సమయంలో, భూమి సంబంధిత పంచనామా విషయాల్లో సమగ్రంగా పరిశీలన చేయాలని ఆదేశించారు. ప్రతి జిపిఓ తనకు కేటాయించిన గ్రామాల వివరాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, గ్రామంలో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం, ఆటవీ భూమి, ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి, ఎండోమెంట్, వక్ఫ్ భూములు, వ్యవసాయ భూమి, చెరువులు, కాలువలు తదితర వివరాలు, ప్రతి సర్వే నెంబర్ ను గుర్తించ గల సామర్థ్యం జిపీఓ లకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, 'ఈ' డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రశేఖర్, తదితర గ్రామపాలన అధికారులు పాల్గొన్నారు.

ప్రమాద స్థలాలను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోండి

జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ జానకి సమక్షంలో రోడ్డు భద్రతపై వివిధ అంశాలపై సమీక్షించారు. జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులపై వివిధ జంక్షన్ల వద్ద మొత్తం 28 బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు గుర్తించామని, అక్కడ స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు,జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మలుపులు, ఫ్లై ఓవర్ నిర్మాణాలు వంటి పనులు చేపట్టేముందు పోలీస్ శాఖ కు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. తద్వారా ట్రాఫిక్ మళ్లించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, ఆర్ అండ్ ఈఈ సంధ్య, జాతీయ రహదారి సేఫ్టీ ఈఈ రమేష్, పోలీస్, ఆరోగ్య శాఖ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story