ఉంటామా.. ఊడుతామా? నేడే తీర్పు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

by velandi.Saikiran |

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జ‌రుగ‌నుంది. రెండు రౌండ్లలో చేవెళ్ల ఫలితాలు వ‌స్తాయి.

ఉంటామా.. ఊడుతామా? నేడే తీర్పు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
X

దిశ, చేవెళ్ల / కొడంగల్: మున్సిపల్‌ పోలింగ్ ప్రక్రియ ముగియగా, ఇప్పుడు అందరి చూపు నేడు వెలువడనున్న ఫలితాలపై నిలిచింది. పైపైకి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు.. లోలోపల మాత్రం టెన్షన్‌తోఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓటర్లు ముంచుతారా.. గట్టెక్కిస్తారా? అన్న ఆందోళనతో రాత్రింబవళ్లు లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్ పూర్తయ్యాక ఏజెంట్ల వద్ద ఉన్న ఓటరు జాబితాల ఆధారంగా సామాజిక వర్గాల వారీగా ఓట్ల లెక్కలు తీస్తున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఓట్లు పడ్డాయి..? ఏ వర్గం తమకు అనుకూలంగా నిలిచింది..? ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు వెళ్లాయో అన్నదానిపై గణాంకాలు వేస్తున్నారు. కొందరు మెజారిటీ లెక్కలు వేసుకుంటుంటే, మరికొందరు పరువు నిలుస్తుందా.. లేదా.. అన్న ఆలోచనలో మునిగిపోయారు. ఎన్నికల ప్రచారంలో డబ్బు, దావతులు, వాగ్దానాలు అన్నీ చేశామని చెప్పుకుంటున్నా, తుది తీర్పు మాత్రం ఓటర్ల చేతుల్లోనే ఉందని అందరికీ తెలుసు. అనుచరులు మాత్రం ‘అన్నా నువ్వే గెలుస్తున్నావ్’ అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న బ్యాలెట్ బాక్స్‌లలోనే బందీ అయింది. ఈ ఫలితాలతో ఎవరి రాజకీయ ప్రయాణం ఎటు మలుపు తీసుకుంటుందో తేలనుంది. అప్పటివరకు టెన్షన్.. టెన్షన్.. వెయిట్ అండ్ సీ! అన్నట్లు ఉంది.

రెండు రౌండ్లు.. 9 టేబుళ్లు..

రెండు రౌండ్లలో చేవెళ్ల ఫలితాలు రానున్నాయి. మొదటి రౌండు లో 1నుంచి 9 వార్డు ల ఓట్ల లెక్కింపు సాగుతుంది. రెండో రౌండ్ లో 10 నుంచి 18 వార్డుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 25 ఓట్ల చొప్పున బెండల్స్ కట్టి వేయి ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. ఆ పైన వచ్చిన ఓట్లను ఆ తర్వాత లెక్కింపు చేస్తారు. బుధవారం మొత్తం 20,661 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 50 వేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 20,711 ఓట్లను లెక్కించనున్నారు. 9 టేబుళ్ల చొప్పున రెండు రౌండ్లల్లో మధ్యాహ్నం వరకు చేవెళ్ల మున్సిపాలిటీ ఫలితాలు వెలువడనున్నాయి. ఆరు మంది ఆర్వోలు, 27 మంది కౌంటింగ్ స్థాఫ్ ఉండగా.. అదనంగా మరో 10 మంది కౌంటింగ్ స్టాఫ్ ను రిజర్వ్ చేయగా.. మొత్తం 37 మంది కౌంటింగ్ స్థాఫ్ ను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ఇంచార్జి, బెండల్స్ ఇంచార్జి, డ్రమ్ ఇంచార్జిలను ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత మధ్య కౌంటింగ్ సాగనున్నది. అనుమతి పాస్ లు ఉంటేనే లోపలికి పోలీసులు అనుమతిస్తారు.

శాంతి భద్రతల కోసం సెక్షన్ 163 ఆదేశాలు: కమిషనర్ సుధీర్ బాబు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతల కోసం బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ఆదేశాలు జారీ చేశామతీ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో 5 మందికి మించి సమావేశం కావడం నిషేధించినట్లు తెలిపారు. ఈ ఆదేశాలు ఆమనగల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో అమలులో ఉంటాయన్నారు. శాంతి భద్రతల కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

Next Story