ఓవైపు పాలమూరు కాల్వ సర్వే.. మరోవైపు జోరుగా వెంచర్లు

by Dishanational2 |
ఓవైపు పాలమూరు కాల్వ సర్వే.. మరోవైపు జోరుగా వెంచర్లు
X

దిశ, కల్వకుర్తి : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారించాలని ప్రభుత్వం ఓవైపు రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టి కాల్వల ఏర్పాటుకు సర్వేలు సైతం చేసింది. ఎక్కడి నుండి కాల్వ పోయే అవకాశం ఉందో గమనించి కొందరు జోరుగా వెంచర్లు వేస్తున్నారు. భూములు అమ్మకున్న వారు వెంచర్లు వేసేవారు కాసులు నింపుకుంటున్నారు. ఆ ప్లాట్లు కొన్న ప్రజల పరిస్థితి ఏంటని నాయకులు, అధికారులు ఆలోచించరా..!

ఇదెక్కడో కాదు, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిసర ప్రాంతాల్లో ఈ నయా రియల్ దందా జోరుగా సాగుతుంది. ప్రధానంగా జేపి నగర్, తాండ్ర పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మరింత జోరుగా పెరిగింది. వాస్తవానికి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కాల్వల కోసం కల్వకుర్తి మండలం మొదలుకొని జేపినగర్, తాండ్ర, కొట్ర గ్రామాల మీదుగా ప్రభుత్వం నియమించిన సంస్థలు మూడు సర్వేలను నిర్వహించారు. అట్టి నివేదికలు ఇరిగేషన్ శాఖకు సైతం అందజేశాయి. ఆ నివేదికలో భాగంగా కొన్ని చోట్ల గుర్తులు సైతం పెట్టి మ్యాపులు రూపొందించారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కాల్వ మూడు వందల అడుగుల వెడల్పు ఉంటుందని అంచనా. ఎందుకంటే ఇక్కడి నుంచి పోయే కాల్వ రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మీదుగా కందుకూరు, మహేశ్వరం మండలాలకు అనుసరించి పోతుంది. అందుకే భారీ స్థాయిలో కాల్వ వెడల్పు ఉంటుంది. కాల్వల కోసం సర్వే చేయించే ప్రభుత్వమే అందులోని మరో శాఖ వెంచర్ల కోసం డీటీసీపీ‌కి అనుమతి ఇవ్వడం విడ్డూరం అని చెప్పవచ్చు. జేపినగర్ తాండ్ర పరిసర ప్రాంతాల్లో కొందరు తాము అధ్బుతంగా అభివృద్ధి చేస్తామని బోర్డులు పెట్టి మొక్కలు నాటి రోడ్లు వేసి కరెంట్ స్తంభాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎంతో అభివృద్ధి జరగబోతుందని పేద ప్రజలకు ఎరవేస్తున్నారు. స్థానిక, పక్క మండలాల ఏజంట్లను పెట్టుకొని వెంచర్లలో భోజనాలు పెట్టి వారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కాల క్రమేణా కాల్వ పనులు వెంచర్ల లోపలి నుంచి వెళ్తే ప్లాట్లు కొన్నవారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల 8 న వనపర్తి జిల్లాలోని జెడ్పీ పాఠశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు చెరువుల పునరుద్ధరణ, విద్య, వైద్యం బలోపేతలా ప్రాజెక్టుల నిర్మాణాలలో భాగంగా పాలమూర్ – రంగారెడ్డి కాల్వ పనులను వేగవంతం చేయాలన్నారు.

ఈ క్రమంలో ఈ మధ్యే జేపి నగర్, తాండ్ర ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్ల నుండి కాల్వ పోయే పరిస్థితి నెలకొంది. కాబట్టి ముందుగా వెంచర్ చేసే పెద్దలు కాల్వ ఎక్కడి నుంచి పోతుందో అధికారులతో ప్రకటింప జేయాలన్నారు. తమ వెంచర్ల నుండి పోవడం లేదని అధికారికంగా ప్రకటన చేయించాలి. ఈ సమస్యకు వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్లాట్లు కొనుగోలు చేసిన వారు, చేస్తున్నా వారు మోసపోయే ప్రమాదముందని తెలిపారు. రూపాయి రూపాయి కూడబెట్టి లక్షలు పోసి ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రజలను మోసపోకుండా వారికి న్యాయం చేసే బాధ్యత అధికారులు, వెంచర్ల పెద్దలకుంది. అధికారికంగా ప్రకటించిన అనంతరం ప్రజలకు నిర్భయంగా ప్లాట్లు అమ్ముకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు మోసపోవడం కాయం. ఆ తర్వాత వారిని ఎవరూ పట్టించుకునే నాథుడే ఉండరు అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed